- యోగాంధ్ర కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు
- మంత్రి డా.డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
విశాఖపట్నం (చైతన్యరథం): ఈ నెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం నాడు విశాఖ దసపల్లా హోటల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్తో కలసి బుధారం మీడియా సమావేశంలో మంత్రి డోలా మాట్లాడుతూ…. యోగా మన సాంప్రదాయానికి ప్రతిరూపం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆరోగ్య జీవనశైలిలో భాగం. ప్రధాని నరేంద్ర మోదీ భావనలతో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు 10 యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహించాం, 11వ యోగా దినోత్సవాన్ని విశాఖ నగరంలో జరపడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగాసనాల్లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. విశాఖ బీచ్లో కాళీమాత ఆలయం నుంచి యోగా ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ 3 లక్షల 26 వేల మందితో యోగా చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
అలాగే మొత్తం 5 లక్షల మంది పాల్గొననున్న యోగా కార్యక్రమం ద్వారా విశాఖ నగరంలో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందిని ఈ యోగా ప్రదర్శనలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో 25 వేల మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేస్తారు. వీటన్నింటికీ విశాఖ వేదికగా మారనుంది. ఇది రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం, అందరూ దీనిలో భాగం కావాలి. 14 సంవత్సరాలు పైబడినవారంతా కార్యక్రమంలో పాల్గొననుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం రవాణా, భోజన వసతి, బస, మరుగుదొడ్ల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్దిష్ట సమయానికి అంటే తెల్లవారుజామున 5 గంటలకే కార్యక్రమ ప్రాంగణాలకు చేరేలా చర్యలు తీసుకున్నాం. ఈ కార్యక్రమ విజయవంతానికి వాలంటీర్లు, సిబ్బంది సమష్టిగా సమన్వయంతో పనిచేయాలన్నారు. మీడియా కూడా ఈ కార్యక్రమ విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కోరారు. యోగా అనేది జీవితంలో ఒక భాగంగా మారాలని, ప్రజలందరూ దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే విశాఖ వేదికగా ఎంపిక చేశామని మంత్రి బాలవీరాంజనేయస్వామి స్పష్టంచేశారు.