- తల్లికి వందనం అమలుపై మంత్రి లోకేష్
- మహిళల గౌరవం పెరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది
- మా కుటుంబంలో మహిళల త్యాగాల వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం
- మా అమ్మ త్యాగం వల్లే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు
- మచిలీపట్నంలో మంత్రి లోకేష్కు ఘనస్వాగతం పలికిన తల్లికి వందనం లబ్ధిదారులు
- పథకం అమలుచేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మహిళలు
మచిలీపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో మహిళల గౌరవం పెరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం పథకం అమలుచేశామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం మచిలీపట్నం చేరుకున్న మంత్రి లోకేష్కు మూడు స్తంభాల సెంటర్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తల్లికి వందనం లబ్ధిదారులైన మహిళలు ఘనస్వాగతం పలికారు. తల్లికి వందనం పథకం అమలుచేసినందుకు మంత్రి నారా లోకేష్కు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలుగు మహిళలు హారతితో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ.. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ రుణపడి ఉంటానన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలను కించపరిచేలా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను, తల్లులను గౌరవించాలని నిర్ణయించాం. సమాజంలో కూడా మార్పు రావాలి. మహిళలతో మాట్లాడే విధానం మారాలి. చట్టాలతో, డబ్బులతో ఆ మార్పు రాదు. గాజులు తొడుక్కో, ఆడపిల్లలా ఏడుస్తున్నావు వంటి వ్యాఖ్యలను మానుకోవాలి. పాఠశాలల్లో మహిళలను గౌరవించేలా విద్యార్థులకు పాఠ్యాంశాలు రూపొందించాం. అన్ని పనులు స్త్రీ, పురుషులిద్దరూ సమానంగా చేయాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
మా అమ్మ త్యాగం వల్లే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు
నాకు, బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మేం సమానంగా ఇంటిపనులు చేసేవాళ్లం. నేను పాదయాత్ర చేసి అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నానంటే అందుకు బ్రాహ్మణి సహకారమే కారణం. బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏం చేయలేను. మా అమ్మ త్యాగం వల్లే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మా అమ్మ త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరు. మహిళల త్యాగాలతోనే మేం ఈ స్థాయిలో ఉన్నాం. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తోంది. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎంపీ బాలశౌరి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.
అడుగడుగునా స్వాగతం
పార్టీ కార్యక్రమాలు, కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రోడ్డుమార్గం ద్వారా మచిలీపట్నం బయలుదేరిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఘనస్వాగతం పలికారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొవ్వ మండలం నిడుమోలు వద్ద మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారితో ఫోటోలు దిగారు.