- ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం భూమి అవసరం
- భూ సేకరణ బదులు భూ సమీకరణ మేలని ఎమ్మెల్యేలు, రైతులు అంటున్నారు
- 30 వేల ఎకరాలు సమీకరిస్తే ప్రభుత్వానికి మిగిలేది ఐదువేల ఎకరాలే
- గత ప్రభుత్వ నిర్వాకంతోనే అమరావతి పనులు ఆలస్యం
- మంత్రి నారాయణ స్పష్టీకరణ
- రాజధాని పనుల కోసం అనంతవరం లోని గ్రావెల్ కొండలను పరిశీలించిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని, దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు. రాజధానిలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు కూడా భూ సమీకరణను కోరుకుంటున్నారని తెలిపారు. భూ సమీకరణ ద్వారా ఎయిర్పోర్ట్ కోసం ముప్పై వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు. వీటిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా ఐదువేల ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు. అందుకే భూ సమీకరణ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విషయంలో భూసమీకరణ లేదా భూసేకరణ అనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణం కోసం 2015లో కేవలం 58 రోజుల్లోనే రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమిని భ సమీకరణ ద్వారా ఇచ్చారనే విషయాన్ని మంత్రి గుర్తు చేసారు.
గత ప్రభుత్వ నిర్ణయంతోనే అమరావతి నిర్మాణ పనులు ఆలస్యం
గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిరదని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. పనులు మధ్యలో నిలిపివేసిన నాటి ప్రభుత్వం…అప్పటి టెండర్లను కూడా రద్దు చేయకపోవడంతో న్యాయ సమస్యలు రాకుండా వాటినన్నింటిని పరిష్కరించాల్సి వచ్చిందన్నారు. దీనికోసం 8 నెలల సమయం పట్టిందన్నారు. ప్రస్తుతం రాజధానిలో పనులు ప్రారంభమయినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 68 పనులకు సంబంధించి రూ.42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. నిర్మాణానికి సంబంధించి అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీకు కేటాయించింది. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయేకు కేటాయించారని, అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని అన్నారు. డ్రోన్ సర్వే ద్వారా ఎంత లోతు వరకూ తవ్వారనే దానిపై స్పష్టత తీసుకుంటామన్నారు. ఇక్కడ ఖాళీగా ఉన్న భూమిని కూడా ఏదొక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామన్నారు…
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయన్నారు. ఒక నిర్దిష్ట కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. ఏడాదిలో అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు, రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.