- 2,000 కి.మీ.మేర నిర్మాణానికి ప్రతిపాదనలు
- రహదారుల మరమ్మతులకు మరో రూ.500 కోట్లు
- రోడ్ల స్థితిగతులపై 15 రోజుల్లో సమగ్ర నివేదిక
- వాహన రద్దీ తెలిసేలా ప్రతీ 50కి.మీ.కు సీసీ కెమేరాలు
- ఆర్ అండ్ బీ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని 2000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మరో రూ.500 కోట్లతో రాష్ట్రంలో దెబ్బతిన్న మిగిలిన రహదారుల మరమ్మతులు వర్షాకాలంలోనూ కొనసాగించాలని… వీలున్నంత త్వరగా వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు రహదారుల నిర్మాణం, మరమ్మతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో అధ్వాన్నంగా తయారయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేపట్టాలి? ఏవి కొత్తగా నిర్మించాలి? నిర్వహణకు ఏ రహదారులివ్వాలి? అనే దానిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సంప్రదాయ విధానంలో రోడ్ల నిర్మాణం వల్ల ఆర్ధికంగా భారం కావడంతోపాటు, నాణ్యత విషయంలోనూ అనుకున్నంత స్థాయిలో లేవని… అందుకే, రహదారుల నిర్మాణంలో అత్యాధునిక విధానాలను అనుసరించాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 20వేల కి.మీ. మేర రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర రహదారులు
‘జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులుండాలి. ప్రతీ రహదారి నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించాలి. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబర్నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఏ రోడ్డు ఏ కాంట్రాక్టర్ నిర్మించారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు.. అనే వివరాలు ఆన్లైన్లో ఉంచాలి. ప్రతీ 50 కి.మీ. చొప్పున అన్ని రహదారులపై సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని అన్ని రహదారుల్లో మరమ్మత్తుల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించి.. వర్షాకాలంలో రోడ్లు పాడవ్వకుండా కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
12,653 కి.మీ పొడవున రాష్ట్ర హైవేలుండగా… ఇందులో 20 కి.మీ. కన్నా పొడవైన రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 20 కి.మీ.కన్నా పొడవైన రాష్ట్ర హైవేలు మొత్తం 260 వరకూ ఉన్నాయి. అంటే 10,200 కి.మీ పొడవైన రాష్ట్ర హైవేలను పీపీపీ విధానంలో చేపట్టేందుకు వీలుంది. వీటిలో అత్యధిక రద్దీవున్న 1,332 కి.మీ పొడవైన 18 రహదారులను ఫేజ్ 1ఏ కింద…, 40 కి.మీ. కన్నా ఎక్కువ పొడవున్న 67 రహదారులు మొత్తం 3,854 కి.మీ మేర ఫేజ్ 1 బీ కింద…, అలాగే, 20నుంచి 40 కి.మీ. మధ్యనున్న 175 రహదారులు మొత్తం 5,039 కి.మీ. ఫేజ్ 2 కింద… అదనంగా 115 కి.మీ పొడవున్న యలమంచిలి- గాజువాక, గాజులమండ్యం-శ్రీసిటీ (సెజ్) రోడ్లు కూడా పీపీపీ విధానంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.