న్యూఢిల్లీ (చైతన్యరథం): శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మౌలిక సదుపాయాల అంశాలపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించానని పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. గడ్కరీతో బుధవారం సమావేశమైన రామ్మోహన్నాయుడు ఆ వివరాలను ఎక్స్లో పంచుకున్నారు. శ్రీకాకులళం జిల్లాలో నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని కోరానని తెలిపారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థికాభివృద్ధికి ఈ రహదారి అత్యంత కీలకం అన్నారు. పాతపట్నం వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి యాక్సెస్ విషయాన్ని కూడా వివరించానని తెలిపారు. మా ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం చూపుతున్న చొరవకు రామ్మోహన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.