- కార్పొరేట్ రంగంలోనూ దార్శనిక నాయకత్వానికి గోల్డెన్ పీకాక్ అవార్డు
- లండన్లో ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ భువనేశ్వరి
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రజాసేవ- సామాజిక ప్రభావం అంశంలో చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. భారత్లోని ప్రముఖ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్` 2025 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రజా సేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ప్రతీ ఏటా ఈ అవార్డులకు ఐఓడీ ఎంపిక చేస్తుంది. 2025 ఏడాదికి గానూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న నారా భువనేశ్వరికి ఇవ్వాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నిర్ణయించింది. నవంబర్ 4 తేదీన లండన్ లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో నారా భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.
ఇంతకు ముందు ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-ఛైర్మన్ గోపీచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా గ్రూప్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ఛైర్పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అందుకున్నారు. ఈ అవార్డుతో అలాంటి విశిష్ట వ్యక్తుల జాబితాలో ఇప్పుడు నారా భువనేశ్వరి చేరనున్నారు. ప్రస్తుతం ఆమె నేతృత్వం వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం లాంటి అంశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందాయి. ప్రత్యేకించి తలసేమియా రోగులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ నిర్వహించటంతో పాటు దీనిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజానికి చేరువైన సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజాసేవా పరాయణురాలైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్కు కార్పొరేట్ గవర్నెన్సు ఎక్సలెన్స్లో గోల్డెన్ పీకాక్ అవార్డు
నారా భువనేశ్వరి మహిళా నాయకత్వానికి స్ఫూర్తిగానూ నిలుస్తున్నారు. కార్పొరేట్ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు వైస్ చైర్పర్సన్, ఎండీగా ఉన్న ఆమె… ఆ సంస్థను పారదర్శకత, సామాజిక బాధ్యతతో నడిపిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక డెయిరీ బ్రాండ్గా హెరిటేజ్ సంస్థను తీర్చిదిద్దారు. సంస్థ ఎదుగుదల, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలతో పాటు కోట్ల మంది వినియోగదారులకు హెరిటేజ్ ఉత్పత్తులు చేరువ చేయటంలో నారా భువనేశ్వరిది కీలక పాత్ర. ప్రత్యేకించి హెరిటేజ్ ద్వారా రైతుల సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారు. వాణిజ్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలకుగానూ దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో నారా భువనేశ్వరి ఒకరని 2013లోనే ఫార్చూన్ ఇండియా పేర్కోంది. ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యుత్తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సెలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో దక్కిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ హోదాలో నారా భువనేశ్వరి అందుకోనున్నారు. లండన్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డును ఆమె స్వీకరించనున్నారు.













