- శ్రీ సీతారామ కల్యాణ దర్శనం మన అదృష్టం
- వొంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తాం
- కొండలపై ఆయుర్వేద మొక్కల పెంపకానికి చర్యలు
- వొంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే ప్రతిధ్వనించాలి
- వొంటిమిట్టలోనూ త్వరలో అన్నప్రసాదం ప్రారంభం
- శ్రీరాముడు పవిత్ర కుటుంబ సంబంధాలకి ఆదర్శం
- శ్రీరాముని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి
- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
వొంటిమిట్ట (చైతన్య రథం): రాష్ట్రంలో రామరాజ్యం తేవాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శ్రీరాముడి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్ఫించారు. అనంతరం కల్యాణం చూడటానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీరామ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మమార్గాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు. సీతారాముల దివ్య కల్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరి అదృష్టంగా అభివర్ణించారు. శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని సీఎం గుర్తు చేశారు. తిరుమలలో గోవింద నామం ప్రతిధ్వనిస్తున్న విధంగా, వొంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదమే మిన్నగా వినిపించాలని, రాష్ట్ర విభజన తర్వాత వొంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఈ ఆలయ బాధ్యతలను దశాబ్దం క్రితమే టీటీడీకి ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ఈ భవ్యమైన రోజున.. తిరుమల మాదిరిగా వొంటిమిట్టలోనూ అన్నప్రసాదం ప్రారంభించాలన్న నిశ్చయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకోవాలని కోరుతున్నాను అని భక్తుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. వొంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటుతామన్నారు. అదేవిధంగా వొంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా మారుతుందన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు వొంటిమిట్టలో అన్నప్రసాదం త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి సవితా, దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.