- అతడి నుంచే ప్రజలకు భద్రత అవసరం
- మంత్రి నిమ్మల రామానాయుడు చురకలు
ఒంగోలు (చైతన్యరథం): జగన్ భద్రతకు ఏ విధమైన ఢోకా లేదని, జగన్ నుంచే ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత అవసరమని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో జగన్ అశాంతి, అలజడులను రేకెత్తిస్తున్నారని విమర్శించారు. పరామర్శల పేరిట ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన నేరగాళ్లకు శిలా విగ్రహాలు నెలకొల్పటం రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు పరామర్శ పేరుతో యాత్రలు చేపట్టి అమాయకుల ప్రాణాలు జగన్ బలితీసుకుంటున్నారన్నారు. తన కాన్వాయ్లో వాహనం కిందపడి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అతని మృతికి జగన్ కారకుడయ్యాడని మంత్రి నిమ్మల తప్పుబట్టారు. జగన్ మనస్తత్వం మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి తన నేర ప్రవృత్తితో రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారన్నారు. సాటి మనిషి ప్రాణం పోతుంటే సామాన్యుడు సైతం స్పందిస్తాడు.. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి అయిఉండి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయిన కర్కశ మనస్తత్వం కలవాడు జగన్ అని మంత్రి దుయ్యబట్టారు.
నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్కు వారిపై ఉన్నది కపట ప్రేమగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చనిపోయిన వాడు మా పార్టీ వాడు మీకెందుకని అనడం అతని దుర్మార్గానికి పరాకాష్టగా పేర్కొన్నారు. పరామర్శల పేరిట ప్రాణ నష్టం కలిగించటం, శాంతిభద్రతలు లోపించాయని ప్రభుత్వంపై ఎదురు నిందలు వేయడం జగన్ కుట్ర రాజకీయంగా విమర్శించారు. సంవత్సరం కిందట బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, మరో ఇద్దరిని బలిగొన్న రాక్షస మనస్తత్వం గల వ్యక్తి జగన్ అన్నారు. పరామర్శల పేరిట ప్రజలపై దండయాత్రలు చేయడం, ప్రాణహాని కలిగించడం అతని ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనంగా చెప్పారు. డీజే సౌండ్ లు, నృత్యాలు, గజ మాలలు వేయించుకోవడం, ఘనంగా స్వాగతం పలికించుకోవడం ఇవన్నీ ఏ రకమైన పరామర్శలు అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనం చచ్చిపోతున్నారు. కాబట్టి అతని పరామర్శలు, పలకరింపులు వద్దు వద్దంటూ, అతని నుంచి మమ్మల్ని రక్షించండంటూ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.