మంగళగిరి (చైతన్యరథం): సగర భగీరథ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధా రోడ్డులో ఆదివారం నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జై భగీరథ అంటూ స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.