- త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
- ట్రయల్ రన్ వేసి మోటార్లు, పంపుల పనితీరును పరిశీలించిన అధికారులు
- వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్యానికి గురైన ఎత్తిపోతల పథకం
- ఐదు సంవత్సరాల్లో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిన వైసీపీ
- అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించిన మంత్రి లోకేష్
- నారా లోకేష్ కృషి పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు, రైతులు
మంగళగిరి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ పాలనలో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పలు అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయి. వైసీపీ పాలనలో నిధుల లేమితో నిలిచిపోయిన పెదవడ్లపూడి హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం మంత్రి నారా లోకేష్ చొరవతో పూర్తయింది. దీంతో మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామంలో ఉన్న హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం త్వరలోనే మంత్రి నారా లోకేష్ చేతులు మీదుగా పారంభం కానుంది. శుక్రవారం ఎత్తిపోతల పథకం వద్ద ట్రయల్ రన్ వేసి మోటార్లు, పంపుల పనితీరును అధికారులు పరిశీలించారు. పైపుల ద్వారా సాగునీటిని దిగువకు విడుదల చేసి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో 9 కోట్ల రూపాయలతో 70 శాతం పనులను పూర్తిచేయగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయకపోవడంతో మిగిలిన 30 శాతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసింది.
ఐదు సంవత్సరాలలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. దీనితో ఐదు సంవత్సరాలు పాటు రైతులు అనేక ఇబ్బందులు పడటంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండిరగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ ఆ ప్రాంత రైతులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల్లోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశారు. దీంతో ఆ ప్రాంత రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 2018లో 9కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించగా. ఇప్పుడు ఆ అంచనా రూ.14.88 కోట్లకు చేరుకున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ నుంచి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేయించారు. ఈ సందర్భంగా ఎస్.సి వెంకటరత్నం మాట్లాడుతూ త్వరలో మంత్రి నారా లోకేష్ చేతులు మీదుగా హైలెవల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని 15 గ్రామాల్లో ఉన్న 25,344 ఎకరాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ అనిల్ కుమార్, జేఈ సుభాషిని, ఐడీసీ ఏఈ గోపిచంద్, తదితరులు పాల్గొన్నారు.