ఉండవల్లి (చైతన్యరథం): వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు శుక్రవారం ప్రదర్శించారు. ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎమ్ శ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు. ఒక్కో స్టెమ్ ల్యాబ్ కిట్ లో 335 ఐటెమ్స్ ఉండనున్నాయి. రీసెర్చ్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా వీటిని రూపొందించారు. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) అంశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడనున్నాయి. వీటితో పాటు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకెండరీ స్కూల్స్కు అందించే లైబ్రరీ బుక్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్, ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్స్, గ్రేడ్ 1,2 విద్యార్థుల కోసం రూపొందించిన ఎఫ్ఎల్ఎన్ హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ను పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎమ్.మస్తాన్ రావు, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న ఓ.నిహారిక గీసిన డ్రాయింగ్స్ను మంత్రి లోకేష్ కు సిబ్బంది బహూకరించారు.