- సింగపూర్ సెంటర్ను సందర్శించిన మంత్రుల బృందం
సింగపూర్ (చైతన్య రథం): రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించారు. అక్కడ ఏఐ గోస్టోర్లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరిస్తూ… వ్యాపారులు, వినియోగదారులు, ప్రేక్షకుల కోసం సంయుక్తంగా రిటైల్, ఎడ్యుకేషన్ మద్దతును అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్లు, పరిశ్రమ పరిష్కారాలను ఊహించడం, ఆవిష్కరణల వర్క్షాప్లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్లు, క్లయింట్ల డిజిటల్ పరివర్తన మార్గాలపై దృష్టి సారించడం వరకు ఇక్కడ తమసేవలు విస్తరించినట్టు చెప్పారు. ముఖ్యంగా ఈ కేంద్రాలను ఐబీఎం, డెల్వంటి కీలకమైన మైక్రోసాఫ్ట్ కస్టమర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ట్రాన్సఫర్మేషన్ కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఐబీఎం` మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ ప్రత్యేకంగా క్లయింట్లకు అజ్యూర్, కాపిలాట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఏఐ ఆధారిత వ్యాపార పరిష్కారాలను చూపడంలో సహకరిస్తుందని చెప్పారు. అనంతరం ఎక్స్పీరియన్స్ సెంటర్ చాంబర్లో మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోప్ా, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
క్వాంటమ్ వ్యాలీలో హ్యాకథాన్ నిర్వహించండి
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపిలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్/ టెక్నాలజీ స్టేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. భారతదేశంలోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, యూఎస్ఏలోని భారతీయ ఐటీ శ్రామికశక్తిలో 25శాతం కంటే ఎక్కువ మంది తెలుగు సమాజం నుండి వచ్చారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి ఏపిలోని టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ యూనిట్ సందర్శన
అనంతరం మంత్రి లోకేష్ బృందం ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను సందర్శించింది. ఈ సందర్భంగా ఇన్ఫినియన్ ప్రెసిడెంట్, ఎండి సిఎస్ చువాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపిలో ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కులలో సెమీకండక్టర్స్ తయారీ (బ్యాక్ ఎండ్/ అసెంబ్లింగ్, టెస్టింగ్)కి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, బీఎంఎస్ వ్యవస్థలను రూపొందించడానికి స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవీ తయారీ యూనిట్లకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందుకు తిరుపతి శ్రీసిటీ, అనంతపురం, కృష్ణా జిల్లావంటి క్లస్టర్లలో ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్)లు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల శిక్షణ కోసం సెమీకండక్టర్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.