- స్పష్టమైన దిశానిర్దేశం, పర్యవేక్షణతో సత్ఫలితాలు
- హర్షం వెలిబుచ్చిన మంత్రి సత్య కుమార్
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖా పరిధిలో చేపట్టిన రెగ్యులర్ సిబ్బంది సాధారణ బదిలీల ప్రక్రియ సాఫీగా ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్పష్టమైన విధివిధానాలు, వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వివిధ స్థాయిల్లో చేపట్టిన పర్యవేక్షణ ఫలితంగా వేలాదిమంది బదిలీలు జరిగాయి. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా జరగడంపై మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదంతో గత నెల 31న మొదలైన బదిలీల ప్రక్రియ గురువారం సాయంత్రానికి పూర్తి కావాల్సి ఉండగా కొంత జాప్యం అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ (హంస) గుర్తింపు విషయంపై హైకోర్టు జారీచేసిన ఆదేశాలతో వివిధ స్థాయిల్లో ఆ సంఘ ప్రతినిధులకు బదీలల నుంచి మినహాయింపునిచ్చే విషయాన్ని పరిశీలించాల్సి రావటంతో ఈ ప్రక్రియ ఆలస్యమయింది. బదిలీల ప్రక్రియను గురువారం రాత్రి ఏ సమయానికైనా పూర్తి చేసేందుకు వివిధ స్థాయిల్లోని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బదిలీల విస్తృతి
ఒకే చోట 5 ఏళ్ళకు పైగా విధులు నిర్వహించినవారిని తప్పనిసరిగా బదిలీ చేయడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి బదిలీ కోరుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు వివిధ విభాగాల్లో పలు స్థాయిల్లో 4,333 మంది సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి వచ్చింది. వీటితో పాటు రెండేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న 3,594 మంది సిబ్బంది బదిలీలు కోరుకున్నారు. బదిలీ ప్రక్రియ ప్రారంభం కాక ముందు వివిధ స్థాయిలు, కేటగిరీల్లో మంత్రిత్వశాఖ 7,512 ఖాళీలను ప్రకటించింది. వివిధ స్థాయిల్లో జరిగిన బదిలీల గురించి మంత్రిత్వశాఖ సమాచారం సేకరిస్తోంది. వీటితో పాటు వైద్య శాఖ పరిధిలో పనిచేసే 9000 పైగా ఉన్న ఏఎన్ఎం గ్రేడ్ – 3ల బదిలీలను గ్రామ సచివాలయ వార్డు డిపార్ట్మెంట్ చేపట్టాల్సిఉంది.
బదిలీ ప్రక్రియ విశిష్టత
కింది స్ధాయిలో పాలనా సహాయక సిబ్బందిపై తరచుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రిత్వశాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మొదటిసారిగా ఒకే చోట మూడు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అకౌంట్ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు వంటి వారిని బదిలీ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భార్యాభర్తలు ఒకే చోట పనిచేస్తూ వారిలో ఒకరైనా అదేచోట ఐదేళ్ళ లోపే విధుల్లో ఉంటే వారిద్దరూ అక్కడే కొనసాగే వెసులుబాటును మంత్రిత్వశాఖ కల్పించింది.
పారదర్శకత కోసం మంత్రి ఆదేశాలు
గతంలో జరిగిన బదిలీలపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు మంత్రి సత్యకుమార్.. ప్రస్తుత బదిలీల్లో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు లేకుండా చేసే దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల స్ధాయిలో ఏమైనా అవకతవకలు జరిగితే వాటికి మంత్రిత్వశాఖలోని విభాగాధిపతులు భాద్యత వహించాల్సి ఉంటుందని, ఎవరినీ ఉపేక్షించబోమని ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు. వివిధ స్థాయిల్లో ప్రకటించే ఖాళీల వివరాలు, సీనియారిటీ లిస్టులపై అభ్యంతరాలు వస్తే వాటిపై వెంటనే తగు వివరణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
అదనపు సమాచారం కోరిన మంత్రి
సాధారణ బదిలీల ప్రక్రియ ముగియటంతో దీనికి సంబంధించిన అదనపు సమాచారాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. మూడు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న ఎంతమంది పాలనా సిబ్బంది బదిలీ అయ్యారు, ఐదు సంవత్సరాలకు మించి ఇంకా ఒకే చోట ఎంతమంది కొనసాగుతున్నారు, అందుకు కారణాలు, సిబ్బంది సంఘాల ప్రతినిధులు ఎంతమంది ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగుతున్నారో వెంటనే తెలియచేయాలని మంత్రి ఆదేశించారు.