- మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత
- రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ హామీ
- పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 30 కోట్లు చెల్లింపుపై మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఐక్య
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఇందులో భాగంగానే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 30 కోట్లు ఒకేసారి విడుదల చేసి చెల్లించడం పట్ల ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ (ఐక్య) ప్రతినిధుల బృందం మంత్రి ఫరూక్కు కృతజ్ఞతలు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్లోని మంత్రి కార్యాలయంలో మంగళవారం రాత్రి మంత్రి ఫరూక్ను ఐక్య బృందం సభ్యులు కలిశారు. ఐక్య ప్రతినిధులు డాక్టర్ గోళ్ళమూడి రాజ సుందర బాబు, కే. హనోక్ బెంజిమెన్, జే. రవికాంత్, ఎం. ప్రేమ జ్యోతి బాబు, తదితరుల బృందం 10 వినతులతో కూడిన పత్రాన్ని మంత్రి ఫరూక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రైస్తవులు, చర్చిలు, పాస్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐక్య ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై జరిగిన పలు దాడులకు సంబంధించిన వివరాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్రైస్తవ మతాన్ని, ఏసుక్రీస్తును అవహేళన చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఐక్య సభ్యులు కోరారు.
అలాగే దశాబ్దాల క్రితం క్రైస్తవ మిషనరీలు ఏర్పాటుచేసిన సమాధి తోటలు ప్రస్తుతం పూర్తిగా నిండిపోయాయని, గత రెండు దశాబ్దాలుగా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, ఒకే సమాధిలో మూడు లేదా నాలుగు పార్థివ దేహాలను పూడ్చే పరిస్థితి నెలకొందన్నారు. క్రైస్తవులుగా చనిపోయిన వారిని, వారి పార్థివదేహాలను మట్టిలో పూడ్చడం మతాచారంగా ఉందన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చి సమాధి తోటలకు స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పాస్టర్లుగా పనిచేస్తూ మత సంబంధ కోర్సులను పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం, విద్యా వైద్య సంస్థలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వ గ్రాంటు మంజూరు చేయాలని కోరారు. క్రైస్తవులు (మాల,మాదిగలు ) బీసీ-సీలుగా ఉన్నందున ఉద్యోగ అవకాశాల్లో ఒక శాతం రిజర్వేషన్ మాత్రమే లభిస్తున్నదని, బీసీ-సీ కేటగిరీలో ఉన్నవారు, పాస్టర్లు, సువార్తీకుల పిల్లలకు గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్-3, ఆర్ ఆర్ బి తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఏడాదికి కనీసం 200 మందికి సదుపాయాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. బాప్టిజం తీసుకోవడం, ఇవ్వడంపై ప్రభుత్వం ఆర్టికల్- 26 ప్రకారం కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉందని, సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఫరూక్కు ఐక్య బృందం విజ్ఞప్తి చేసింది. దీనిపై మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తనకు అందజేసిన పది వినతులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనారిటీల అభివృద్ధి లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఐక్య సమర్పించిన వినతులపై చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.