- మహిళల ఆర్యోగం కోసం స్మార్ట్ శానిటరీ ప్యాడ్ రూపకల్పన
- విద్యార్థి వనమా వంశీని అభినందించిన మంత్రి నారా లోకేష్
- భవిష్యత్లో మరింత ప్రోత్సహిస్తామని హామీ
ఉండవల్లి (చైతన్యరథం): ఢల్లీిలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్లో మహిళల ఆరోగ్యం కోసం మాగ్నా ప్యాడ్స్ పేరుతో స్మార్ట్ శానిటరీ ప్యాడ్ ను రూపొందించి విశేష ప్రతిభ కనబరిచిన మంగళగిరి విద్యార్థి వనమా వంశీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ను గురువారం వంశీ కలిశారు. స్టార్టప్ మహాకుంభ్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా విద్యార్థి వంశీని మంత్రి లోకేష్ ప్రశంసించారు. భవిష్యత్లో అండగా ఉంటామని, అమరావతిలో ఏర్పాటు చేయబోయే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.
జాతీయస్థాయిలో జరిగే స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్లో దాదాపు వెయ్యి కాలేజీలకు చెందిన విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ తన గైడ్ డాక్టర్ పి.శ్రీనివాస్ బాబు సాయంతో స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్కు హాజరై మహిళల ఆరోగ్యం కోసం తాను రూపొందించిన స్మార్ట్ శానిటరీ ప్యాడ్ను ఆవిష్కరించారు. తన వినూత్న ఆవిష్కరణతో రూ.8లక్షల నగదు బహుమతిని గెలుచుకుని సౌత్ ఇండియాలోనే ప్రథమంగా నిలిచాడు. వంశీ ఆవిష్కరణను ఇండియన్ జనరల్ ఆఫ్ పేటెంట్స్లో కూడా పబ్లిష్ చేశారు.