- టాప్-20 జ్యుయలరీ సంస్థలు యూనిట్లు స్థాపించేలా చర్యలు
- ప్రతిఏటా 4వేల మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ
- అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): దేశంలో అత్యుత్తమ మోడల్లో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుపై అధికారులతో గురువారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీసంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉడిపిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయలరీ (ఐఐజిజె) పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
దీనిపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ గణేష్ కుమార్ స్పందిస్తూ త్వరలో ఏర్పాటుచేసే కామన్ ఫెసిలిటీ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ద్వారా ప్రతిఏటా 4వేలమందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్కులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ), కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ), ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ అండ్ రిటైల్ జోన్, మ్యానుఫాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇన్ ఫ్రా జోన్ అంతర్భాగాలుగా ఉంటాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరిలో యువతకు నైపుణ్యశిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీి)ను కూడా త్వరితగతిన ఏర్పాటు చెయ్యాలన్నారు. ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్మెంట్ చేపట్టాలని అన్నారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1170మంది యువకులు హాజరుకాగా, 453మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ… ఇకపై ప్రతినెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు నూరుశాతం ఉద్యాగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.రఘు, అసోసియేట్ డైరక్టర్ పురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.