అమరావతి (చైతన్య రథం): శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రిన ప్రారంభమవుతున్న మహా భక్తి ఛానెల్ గొప్ప శక్తిగా అవతరించాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా భక్తి టీవీ సాంగ్ను ఆవిష్కరించారు. ఉపనిషత్తుల సారాంశాన్ని తెలిపే వెబ్ సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజున మహా భక్తి ఛానెల్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. కార్యక్రమానికి వచ్చిన నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్కు భక్తి పూర్వక నమస్కారాలు. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ను ఇలా కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నా ఆలోచన మారింది. శివుడిపై భక్తి పెరిగింది. రాముడిలానే కాదు, అప్పుడప్పుడు శివుడిలా మారాలి. శివుడి గురించి తెలుసుకొని నేను ఎన్నో విషయాలు ఫాలో అవుతున్నాను. నేను రోజూ సమావేశాలు పెట్టుకునే రూమ్లో కూడా శివుడి విగ్రహం ఉంటుంది. ప్రతి రోజూ శివుడిని పూజిస్తాను.
శివుడిని తలచుకున్నా, అయన విగ్రహాన్ని చూసినా నాకు ధైర్యం వస్తుంది. నేను యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నడవలేనంటూ విమర్శలు చేశారు. నేను శివ భక్తుడిని. 226 రోజులు.. 3,132 కిలోమీటర్లు నన్ను శివుడే నడిపించాడు. సత్యం.. శివం.. సుందరం. శుభాలను ఇచ్చేవాడు.. శివుడు. అందరికీ సంతోషాన్ని పంచేవాడు శివుడు. మానవత్వం… శివతత్వం. విషాన్ని మింగి అందరికీ అమృతం పంచిన ఆదిదేవుడు శివుడు. ధ్యానం.. మౌనం.. జ్ఞానం తప్ప వేరే అలంకారాలు ఉండవు. భక్తి తప్ప మరే కానుకలు అక్కరలేదు. కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు. అర్ధ నారీశ్వరుడు రూపంలో మహిళల గొప్పతనం, మహిళల్ని గౌరవించాలని మనకు నేర్పింది శివుడే’ అన్నారు. ఒక సామాన్య జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి.. నేడు మహా గ్రూప్ ఛానెళ్లకు మేనేజింగ్ డైరెక్టరుగా ఎదిగిన మారెళ్ల వంశీకృష్ణను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మహా కుంభమేళా ఆఖరి రోజున, మహా శివరాత్రి పర్వదినాన మొదలైన మహా భక్తి ఛానెల్ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేయాలన్నారు. ఛానెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.