శాన్ఫ్రాన్సిస్కో/యూఎస్ఏ (చైతన్యరథం): ఏపీలో ఏఐ యూనివర్శిటీ ఏర్పాటుకు కలిసి పనిచేద్దామని ప్రఖ్యాత ఓపెన్ ఏఐ సంస్థను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఆమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఒక కుటుంబంలో ఒక ఏఐ ఆధారిత సభ్యుడు.. అనే లక్ష్యాన్ని సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం మాతో కలిసి పనిచేయండి. తొలిదశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపీటీ అందించాలని భావిస్తున్నాం. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. డేటా సెంటర్ హబ్గా మారుతున్న ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస్ నారాయణన్ మాట్లాడుతూ… ఎంటర్ ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180కి పైగా దేశాల్లో వినియోగదారులు, సంస్థలకు సేవలు అందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామన్నారు. (90 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన చాట్ జీపీటీ సంస్థ గత ఏడాది చాట్ జీపీటీ ప్లస్, ఏపీఐ సర్వీసెస్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ సేవల ద్వారా 3.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.












