- వైసీపీ అరాచకాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
- క్రిమినల్స్ను ఫర్మ్గా డీల్ చేస్తామని హెచ్చరిక
- డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటుపడ్డారంటూ వ్యాఖ్య
- కేబినెట్ అజెండా లీక్పైనా లోతైనా చర్చ
- మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో క్రిమినల్స్ రాజకీయుల ఆటల సాగనివ్వకూడదని, ప్రజలకు నిజాలు తెలియచేస్తే.. డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటుపడ్డవాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ భేటీ జరిగింది. వివిధ అంశాలపై మంత్రిమండలి లోతైన చర్చ సాగించి ఆమోదం తెలిపిన అనంతరం.. సీఎం చంద్రబాబు ఇన్సైడ్ మీటింగ్లో మాట్లాడారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ‘కొత్త పలుకు’పై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఏబీ కేబినెట్లో చర్చ జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘కొత్త పలుకు కాదు… ఇక పలుకే ఉండదు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు రామానాయుడు కేబినెట్ దష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘లేపేస్తాను అని అంటున్నారు… వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఎవరిని లేపుతారు.. ఇటువంటి క్రిమినల్స్ చేసే బెదిరింపులకు ఎవరూ భయపడరు’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. క్రిమినల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్మ్గా డీల్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. బెదిరించి భయపెడదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలని, అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ‘క్రిమినల్స్ ఇలానే రాజకీయాలు చేస్తారు. వాళ్ల ఆటలు సాగనివ్వకూడదు. ప్రజలకు నిజాలు తెలియచేస్తే సరిపోతుంది. డైవర్షన్ పాలిటిక్స్కు వాళ్లు అలవాటు పడ్డారు’ అంటూ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు.
కేబినెట్ అజెండా లీక్పై చర్చ
కేబినెట్ అజెండా లీక్ అవుతున్న విషయంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ‘కేబినెట్ అజెండా బయటకు వెళ్తుంది. అందరం బాధ్యతగా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. ముందు మన వద్దకు వస్తుంది’ అని సీఎం అన్నారు. గతంలో బడ్జెట్ లీక్ అయితే 30మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని సీఎం గుర్తు చేశారు. పేపర్ లీక్ కేసులో ఆ రోజు బాలయోగి రాజీనామా చేశారని చెప్పారు. ఇప్పుడు సాంకేతికతతో ఎవరినుంచి లీక్ అయిందో తేలికగా కనుక్కోవచ్చని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ సంఖ్యలో డీమ్డ్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని సీఎం చర్చించినట్టు తెలిసింది.
మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలి
జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మంత్రులు ఓనర్ షిప్ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి నాలుగు కార్యక్రమాల్లో అయినా పాల్గొనాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలూ ఇదే అనుసరించాలన్నారు. జలధారకు ఉపాధి హామీ నిధులు అనుసంధానమయ్యేలా పనులు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ కింద వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
రూ.9.36 లక్షల కోట్లకు ఆమోదం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9.36 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్టు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తద్వారా 9.62 లక్షలమందికి ఉద్యోగాలు లభించాయన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ భేటీ జరింది. సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. విశాఖపట్నం, అనకాపల్లిలో ఏఐ డేటా ప్రాజెక్టు అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు. విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపనకు సీటెక్ భూముల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సత్యసాయి జిల్లాలో ఔట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ (ఓశాట్) సౌకర్యం, సత్యసాయి జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఆరఆర్ ఎలక్ట్రానిక్స్కు 60 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. ఏపీఐఐసీ, టీసీఎస్ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు ఆమోదం, ఏపీఐఐసీ, రహేజా కార్ప్ సంస్థ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు ఆమోదం తెలిపిందన్నారు.















