- ఏం చేయాలో చెప్పండి
- పెండ్లిమర్రు డిగ్రీ కళాశాల విద్యార్థుల సూచనలు కోరిన మంత్రి లోకేష్
- ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి
కమలాపురం (చైతన్యరథం): కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రులో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి లోకేష్ బిఎ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనది, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను కోరి తీసుకున్నా.. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి మంత్రిగా తాను ఏం చేయాలో చెప్పాల్సిందిగా సూచనలు అడిగారు. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీని పెంచాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తిచేశారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్లం శ్రీనివాసరావు, విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.