- అధినేత చంద్రబాబు ఆదేశాలు
- పార్టీ నేతలందరికీ తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీలో చేరికలకు ఆ పార్టీ అధిష్టానం బ్రేక్ వేసింది. ఇక హైకమాండ్ అనుమతి లేకుండా ఎవర్నీ చేర్చుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి చేర్చుకునే ముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పార్టీ నాయకులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమాచారమిచ్చారు. అధినేత ఆదేశాల గురించి తెలియజేశారు. పార్టీలో చేరాలనుకునే నాయకుల గురించి సమాచారం ఇస్తే.. వారి గురించి కేంద్ర కార్యాలయం పూర్తిగా విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు..జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, నియోజకవర్గ పరిశీలకులు.. అందరూ గమనించాలని పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.