- యోగాను పాఠ్యాంశం చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ
- విద్యార్థి దశలో యోగా అలవడితే అదే వారి జీవన విధానం అవుతుంది
- ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్ర సాకారానికి నాంది పలుకుతుంది
- రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు
అమరావతి (చైతన్యరథం): ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పని సరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకూ యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. యోగాంధ్రా-2025 కార్యక్రమంలో భాగంగా గురువారం అమరావతిలోని రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మానవాళి యావత్తూ ఆరోగ్యంగా సుఖ శాంతులతో జీవనం సాగించాలనే సత్సంకల్పంతో భారతీయ రుషులు ప్రపంచానికి అందజేసిన సనాతన కార్యక్రమం యోగా అన్నారు.
అయితే నేటి ఆధునిక సమాజంలో మానవుడు యాంత్రిక జీవన విధానాన్ని అనుసరించడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించే యోగా కార్యక్రమం కనుమరుగు అయిపోతున్నదన్నారు. ఈ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారన్నారు. విశాఖపట్నం వేదికగా ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకూ నిర్వహించే ఈ వేడుకల్లో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటున్నారని, అందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో వారిని భాగస్వాములు చేసేందుకు గత నెల 21 నుండి ఈ నెల 21 వరకూ యోగాంధ్రా-2025 కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ కాలుష్య నియంత్ర్రణకు కృషి చేయాలని, యోగాను అభ్యసిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు.
రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కె. రఘు రామకృష్ణరాజు మాట్లాడుతూ పూర్వీకులు మనకు అందజేసిన యెగాభ్యాసాలు కాల క్రమేణా కనుమరుగు అయ్యే పరిస్థితులు ఏర్పాడుతున్నాయని, అటు వంటి ఉత్తమ ప్రక్రియలను తిరిగి సంగ్రహించే కార్యక్రమం రాష్ట్రంలో మొదలైందన్నారు. విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తామని తెలిపారు. గత నెల 21 నుండి ఈ నెల 21 వ తేదీ వరకు యోగాంధ్రా-2025 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రపంచ దృష్టిన అకర్షించే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21 న విశాఖపట్నం ప్రధాన వేదికగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశ పధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారన్నారు. అనంతరం ఆయూష్ శాఖ నుండి వచ్చిన వైద్యాధికారులు డా.రామానందం, డా.రత్న ప్రియదర్శిని.. శాసన సభ ఉద్యోగులకు యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఉపకార్యదర్శులు కె.రాజకుమార్, వనితా రాణి, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్.శ్రీనివాసరావు, తదితరులతో పాటు శాసనసభ ఉద్యోగులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.