విశాఖపట్నం (చైతన్యరథం): ‘అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’ అంటూ మహిళల ఆత్మగౌరవన్ని దెబ్బతీసేలా, తీవ్ర అవమానాలకు గురిచేసేలా సాక్షి టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని బుధవారం రాత్రి భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వీవీఆర్ కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ క్రమంలో కొమ్మినేని, కృష్ణంరాజుతోపాటు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది.