- పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే.. స్థానికులకు న్యాయం
- జిరాయితీ, డి-పట్టా భూములపై హక్కులు కాపాడే యత్నం
- ఉప్పుటేరు డ్రయిన్ అడ్డంకుల తొలగింపునకు తక్షణ చర్యలు
- కొల్లేరులో సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5న కోటి మొక్కల ప్లాంటేషన్
- అధికార్లు, ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలున్నారు… కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలాకాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్య పరిష్కారం కోసం 2014నుంచి 2019 మధ్య నాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులను నిర్థారించాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సిఫారసు కూడా చేసింది. అయితే దీనిపై కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కొల్లేరు సమస్య పరిష్కారంపై పట్టుదలగా ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ ప్రాంతం ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు.
కాలుష్య ప్రక్రియకు అడ్డుకట్ట పడాలి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలి. కొల్లేరులోకి వెళ్తున్న డ్రైన్ వాటర్కు ట్రీట్మెంట్ జరగాలి. విచ్చల విడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్ పడాలి. డ్రైన్లో పూడికలు తొలగించాలి…. నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలి. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించాలి. ఉప్పుటేరు పూడిక తీసి, ఆక్రమణలు తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలి. అవుట్ లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలి. ఈ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలి’’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొల్లేరు రైతుల సమస్యలపై మాట్లాడుతూ…. ‘‘కొల్లేరు పరిధిలో 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములు ఉన్నాయి. కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని, సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలి. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. సమీక్షకు చీఫ్ సెక్రటరీ విజయానంద్తో పాటు అధికారులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు.
జూన్ 5న కోటి మొక్కల ప్లాంటేషన్
రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై సమీక్షించారు. ఈనెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఇది గతేడాది 29 శాతం వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5 శాతానికి పెరిగిందని సీఎం అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37 శాతానికి, 2047కి 50 శాతానికి చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రతి ఏడాది కనీసం 1.5 శాతం మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఫారెస్ట్తో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతీ ప్లాంట్ను ట్యాగ్ చేయాలన్నారు. రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండాలని, మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకువస్తే వారికి అవకాశం కల్పించే విధానం తీసుకురావాలని సూచించారు. అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను మియావకీ తరహాలో పచ్చదనం పెంచి, మూడేళ్లలో ఫలితాలు చూపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.