- సైనికుల ప్రాణత్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు
- పెద్దపెద్ద కలలుకని వాటి సాకారానికి కృషిచేయాలి
- చంద్రబాబును అక్రమంగా నిర్బంధించినప్పుడు అండగా నిలిచారు
- మా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది
- రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే కసి ఉంటుంది
- కుమారస్వామి విశాఖ ఉక్కును కాపాడారు
- కుమారస్వామికి ఎప్పుడూ అండగా నిలవాలి
- శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో లోకేష్
సింధనూరు (చైతన్య రథం): “తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడున్న తెలుగువారు అండగా నిలిచారు. మా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది” అని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ కతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు హోసళ్లీ క్యాంప్లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్తో కలిసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ… ‘ఎల్లారిగు నమస్కారా. నిమ్మ ప్రీతిగే ధన్యవాదగలు’ అంటూ కన్నడలో పలకరించారు. కర్ణాటక పవిత్ర భూమి. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం గొప్పది. కన్నడ, తెలుగు తుంబా సేమ్. నమ్మ సంస్కృతి కూడా సేమ్. ఆంధ్రా, కర్ణాటక అన్నా తమ్మన తారా” అంటూ ఆహూతులను ఆకట్టుకున్నారు.
సైనికుల ప్రాణత్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు
“శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. నేను ఏపీ విద్యా మంత్రిగా ఇక్కడకు రాలేదు. భారతీయ పౌరుడిగా వచ్చాను. ఇక్కడున్న విద్యార్థుల్లో ఎంతమంది డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, టీచర్లు, పొలిటీషియన్స్ కావాలనుకుంటున్నారు? రాజకీయ నాయకులు కావాలనుకునే వారు తక్కువగా ఉన్నారు. మీలో ఎంతమంది సైనికులు కావాలనుకుంటున్నారు? ఇక్కడ మనం ప్రశాంతంగా సమావేశం అయ్యామంటే కారణం సరిహద్దుల్లోని సైనికులు. సైనికుల ప్రాణత్యాగాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎక్కడైనా సైనికులు కనపడితే సెల్యూట్ చేయండి” అంటూ పిలుపునిచ్చారు.
మురళీ నాయక్ కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలిచింది
“ఉగ్రవాదులు పెహల్గాంపై దాడి చేశారు. అమాయకులను చంపేశారు. అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పారు. కానీ ఆ పోరాటంలో మురళీ నాయక్ అనే ఒక జవాన్ చనిపోయాడు. అతనిది అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. ఆ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. మురళీ నాయక్కి చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ. ఆర్మీకి వెళ్తానంటే ముందు అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు మురళీ నాయక్ ఒక్కటే చెప్పాడు. నేను దేశం కోసం చనిపోతే దేశం మొత్తం మీకు అండగా ఉంటుంది అని. అదే జరిగింది. మురళీ నాయక్ని పాకిస్థాన్ ఆర్మీ చంపేసింది. దేశం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలబడింది” అని లోకేష్ చైతన్యంతో మాట్లాడారు.
చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలి
“ఆంధ్రప్రదేశ్లో విలువల ఆధారిత విద్యా బోధన మొదలు పెట్టాం. సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. చిన్నప్పటి నుంచే విలువలు పెంచాలి అని గౌరవ ముఖ్యమంత్రి సీబీఎన్ గారు డైరెక్షన్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్ గా నియమించుకున్నాం. ఆయన విలువలపై పుస్తకాలు రాశారు. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలి. మహిళలను అవమానించే కొన్ని మాటలు ఉన్నాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడుస్తావు లాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పాలి. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక గొప్ప మాట చెప్పారు. తల్లికి చెప్పలేని పని చేయకూడదు అని. చాలా సింపుల్.. బట్ పవర్ ఫుల్. అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ చేయవద్దు” అని హితవు పలికారు.
ఎదురుదెబ్బ తగిలినా అధైర్యపడకూడదు
“ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు, బాలయ్య బాబు అల్లుడిని. లోకేష్కు ఏంటి గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కానీ నాకు ఇది అంత ఈజీగా రాలేదు. నేను తెలుగుదేశం పార్టీ 1985నుంచి గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీచేసి ఓడిపోయాను. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడ్డాను. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీ 91వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను. నేటి పిల్లలు చాలా సెన్సిటివ్గా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్లో ఫెయిలైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదు. ఆ ఎదురుదెబ్బే మనలో కసిపెంచాలి. అహర్నిశలు కష్టపడాలి. అనుకున్నది సాధించాలి. ఫెయిల్ అంటే ఫస్ట్ ఎటెమ్ట్ ఇన్ లెర్నింగ్. కర్ణాటక విద్యార్థులు చాలా తెలివైన వారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. మీ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. మీరు దేశ భవిష్యత్. పెద్దపెద్ద కలలు కని వాటి సాకారానికి కృషిచేయాలి” అని లోకేష్ పిలుపునిచ్చారు.
చంద్రబాబును అక్రమంగా నిర్బంధించినప్పుడు అండగా నిలిచారు
“నేను కర్ణాటక వచ్చినట్టు లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుంది. పెద్దఎత్తున నాకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ ఆంధ్రాలో జన్మించిన వారున్నారు. కర్ణాటకకు వలస వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైనా కర్ణాటకను కన్నతల్లిలా భావిస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లు రోడ్లపైకి వచ్చి మాకు అండగా నిలిచారు. సింధనూరులో 10వేల మందితో ర్యాలీ చేశారు. రాయచూర్, గంగావతిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. మీకు అవి ర్యాలీలుగా కనిపించవచ్చు. కానీ మా కుటుంబానికి అవి కొండంత బలం. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని తెలుగువారంతా మాకు అండగా నిలిచారు. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఎన్నికల్లో కూడా మీరు రాష్ట్రానికి వచ్చి పనిచేశారు. భారీ మెజార్టీతో గెలిచాం. ఇందుకు మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది” అని లోకేష్ కతజ్ఞతలు తెలిపారు.
సింధనూరు రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయలేరు
“సింధనూరు ఎడ్యుకేషన్లో నెం.1. ఆటోమొబైల్, రైస్ ప్రొడక్షన్, హయ్యస్ట్ ట్యాక్స్ పేయింగ్లో నెం.1. సింధనూరు రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయలేరు. సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ కూడా నెం.1 కావాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వలస వచ్చిన తెలుగువారు సొంత నిధులతో నిరుపేదలకు విద్య, వైద్యం అందించారు. ఈ సేవా ధృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడున్న తెలుగువారిని కోరుతున్నా” అని లోకేష్ పిలుపునిచ్చారు.
రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే కసి ఉంటుంది
“ఇక్కడికి వచ్చినప్పుడు నా పాత రోజులు గుర్తువచ్చాయి. అప్పుడు కర్ణాటక సీఎంగా ఎసఎం కృష్ణ గారు ఉండేవారు. ఉమ్మడి ఏపీలో సీబీఎన్ గారు సీఎంగా ఉండేవారు. ఇద్దరిమధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఎవరు ఏ కంపెనీని తమ రాష్ట్రానికి తీసుకెళ్తారో అని పోరాడేవారు. ఆ పోటీయే వారిలో కసి పెంచింది. ఆ పోటీ వల్లే అటు ఉమ్మడి ఏపీ, ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందాయి. కాంపిటీషన్ ఉంటేనే కసి ఉంటుంది” అని అన్నారు.
కుమారస్వామి విశాఖ ఉక్కును కాపాడారు
కుమార స్వామి కుటుంబంతో మాకు మంచి అనుబంధముంది. దేవగౌడతో సీబీఎన్కు మంచి అనుబంధముంది. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు ఉంటే.. దేశ ప్రధానిగా దేవగౌడ ఉన్నారు. వారిద్దరూ కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చారు. దేశాన్ని అభివృద్ధి చేశారు. 30 ఏళ్ల తర్వాత నేను కుమారస్వామితో మాట్లాడటం జరిగింది. గత పాలకుల అవినీతివల్ల విశాఖ ఉక్కు పరిశ్రమ అనేక ఇబ్బందులు పడింది. చివరకు ప్లాంట్ మూయడమో, విక్రయించే పరిస్థితి వచ్చింది. ఏపీకి మద్దతుగా నిలుస్తానని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వబోమని కుమారస్వామి మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏకంగా అనకాపల్లికి వచ్చింది. లక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం వెనుక కుమారస్వామి పాత్ర ఉంది. కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కశాఖ మంత్రిగా ఉండటం దక్షిణ భారతదేశం చేసుకున్న అదృష్టం. మీకు అన్ని విధాల మద్దతుగా ఉంటాం. దక్షిణ భారతదేశ, కర్ణాటక, ఏపీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. దేశానికి గర్వకారణంగా నిలుద్దాం” అని లోకేష్ భావోద్వేగంగా ప్రకటించారు.
కుమారస్వామికి ఎప్పుడూ అండగా నిలవాలి
కుమారస్వామికి ఎమోషన్స్ ఎక్కువ. మనసులో ఉంది చేసేస్తారు. అందరూ అది బలహీనత అంటారు. అది మన కుమారస్వామి బలమని చెబుతున్నా. మనందరం కలిసికట్టుగా కుమారస్వామికి అండగా నిలబడాలి. మనకు ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన అండగా నిలిచారు. కాబట్టి నాడు, నేడు, ఎప్పుడూ కుమారస్వామికి మనందరం అండగా నిలవాలి. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశంలో ఉత్తమ సైనిక స్కూల్స్లో ఒకటిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను అండగా ఉంటాను. నేను కూడా ఈ దేశ పౌరుడినే. నేను కర్ణాటక చిన్న తమ్ముడిని. అన్నివేళలా అండగా ఉంటాను. ఎన్నో ఏళ్లుగా ఈ పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు నా అభినందనలు. కర్ణాటక కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, మనదేశానికి బలమని మంత్రి పేర్కొన్నారు. ఘనస్వాగతం పలికిన తెలుగువారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని.. మీకు జీవితాంతం రుణపడి ఉంటా’నని మంత్రి లోకేష్ చెప్పారు.
కార్యక్రమంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెడ్డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్తో పాటు విశాఖ ఎంపీ శ్రీభరత్, కర్ణాటక వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, కర్ణాటక కన్నడ, సాంస్కృతిక మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి, కర్ణాటక చిన్న నీటిపారుదల మంత్రి ఎన్.ఎస్ బోసురాజు, కొప్పళ మాజీ ఎంపీ కే.విరూపాక్షప్ప, కర్ణాటక మాజీ మంత్రి, కేవోఎఫ్ (బెంగళూరు) ప్రెసిడెంట్ వెంకటరావు నాడగౌడ, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లీ, కొప్పళ ఎంపీ కే.రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్, రాయచూర్ ఎంపీ జి.కుమార్ నాయక్, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లీ, ఎమ్మెల్సీ బసవగౌడ బాదర్లీ, అమృత కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్(బెంగళూరు) వ్యవస్థాపకులు పీవీ రావు, శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ బి.వెంకటరావు, డైరెక్టర్లు, సింధనూరు స్థానిక తెలుగు ప్రజానీకం పెద్దఎత్తున పాల్గొన్నారు.
















