- సీఎం చంద్రబాబు కఠోరశ్రమతో ఏడాదిలోనే అభివృద్ధి పథంలో రాష్ట్రం
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం
- ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు
- ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు
- రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
- తెలుగువారి కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటుదామని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు
అమరావతి (చైతన్యరథం): ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజారిటీతో అధికారం అప్పగించి జూన్ 4వ తేదీకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన మహత్తర ఘట్టాన్ని స్మరించుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మార్గదర్శకంగా నిలిచిన రోజుగా జూన్ 4ను ఆయన అభివర్ణించారు. గత ఏడాది జూన్ 4వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అప్పటి అధికార వైసీపీని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించి ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీతో అధికారం అందించిన విషయం తెలిసిందే. ప్రజాతీర్పు వెల్లడై ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజల మద్దతుతో వచ్చిన విశ్వాసం, అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వ తపన విజయాల వనరుగా మారిందన్నారు. ఇది కేవలం పాలన కాదు ఇది ఒక శ్రద్ధ, ఒక సంకల్పం, ఒక ప్రజా పోరాట ఫలితం. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధి, సమగ్ర ప్రగతి, ఆర్థిక పురోగతి, పారదర్శక పాలనతో అనేక విజయాలను సాధించింది. ఈ ఏడాది ప్రజల విశ్వాసానికి తగిన విధంగా రాష్ట్ర పునఃనిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దిశను ఇచ్చిన రోజు. ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన రోజు మాత్రమే కాదు.. జనసామాన్యానికి సేవ చేయాలనే సంకల్పానికి స్వరం ఇచ్చిన రోజుగా మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఏడాదిలో ఎన్నో విజయాలు
రాష్ట్రంలో ఏ శాఖలో చూసినా అప్పులు, సమస్యలు తప్పించి ఆదాయం వచ్చే వనరులు ఏమీ లేని దశలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవం, కఠోర కష్టంతో తొలి ఏడాదిలోనే 700లకు పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను అమలు చేసింది. తొలి మాసంలోనే రూ.3 వేలు పెన్షన్ను రూ.4 వేలకు పెంచాం, పేదవారి ఆకలి తీర్చేందుకు 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాం, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించాం. రికార్డు స్థాయిలో 54 లక్షల ధాన్యం సేకరించి, 24 గంటల్లోనే డబ్బులు చెల్లించాం, 20 వేల కి.మీ రోడ్లక్లు మరమత్తులు చేసి గుంతల రహిత రోడ్లుగా తీర్చిదిద్దాం. ప్రజా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభించాం. అతి భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో నూతన వెలుగులు నింపాం. మత్య్సకార భరోసా కింద రూ.20 వేలు వేట నిషేధ భృతి అందిస్తున్నాం. సేద్యానికి ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ణీ చేశాం. రూ.9.40 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి 6 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం.
ఇలా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పనిచేస్తోంది. నేడు పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడిరది. గ్రామాలు అభివృద్ధి పథాన నడుస్తున్నాయి. పచ్చని పైరు గాలికి ఊగుతున్నట్లు చిరునవ్వుతో రైతుల ముఖాలు వెలుగుతున్నాయి. రాత్రివేళ ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. యువత మత్తుపదార్థాలకు దూరమయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పాలనలో మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ వినియోగాలు వంటి నూతన సంస్కరణలను ఆవిష్కరించాం. ఈ విజయాలు కేవలం ప్రభుత్వం సాధించినవే కాదు.. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయాలు. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు.