మంగళగిరి (చైతన్య రథం): రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లూలూ, రిలయన్స్, ఎన్టీపీసీ గ్రీన్టేక్ హైడ్రోజన్ వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు అవిరళ కృషేనన్నారు. విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ వస్తోంది. విశాఖలో సిఫి ఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రారభించబోతున్నారు. ఢిల్లీలో గూగూల్ కు చెందిన రైడెన్తో రూ.87,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నాం. ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్గా వర్జీనియా ఉంది. రేపు వరల్డ్ డేటా సెంటర్గా విశాఖ మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయాలన్న లక్ష్యంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. విశాఖను డేటా హబ్, డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లబోతున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ కృషితో నేడు విశాఖ ఐటీ సిటీగా రూపాంతరం చెందబోతోంది. విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే… జగన్ రెడ్డి అడుగడుగునా భవిష్యత్ భయంతో అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారు. పెట్టుబడిదారులకు భయాందోళనలు కలిగించేలా జగన్ అల్లర్లు చేస్తున్నారు. పెట్టబడులు పెట్టకండని అనేక ఆర్థిక సంస్థలకు వైసీపీ వాళ్లు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీపీపీకి అర్థం తెలియని వ్యక్తి జగన్
“మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు జగన్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు ప్రచారం చేశారు. గత ఐదేళ్లల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కు జగన్రెడ్డి ఒక్కపైసా వెచ్చించలేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8,700 కోట్లు కావాల్సి ఉంటే వైసీపీ కేవలం రూ.1400 కోట్లు ఖర్చు చేసింది. అదీ కేంద్రం నిధులు. ఐదు మెడికల్ కాలేజీలను అరకొర వసతులతో ప్రారంభించారు. ఒక్క కాలేజీని కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదు. ఆస్పత్రి నిర్మాణం లేకుండానే మెడికల్ కాలేజీల బిల్డింగులు నిర్మించారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకుండా శంకుస్థాపన చేసి పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పులివెందుల సీఎంగా ఉండి రూ.400 కోట్లతో పులివెందుల మెడికల్ కాలేజీ కట్టారు. అక్కడా కనీసం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయాడు.
మిగతా కాలేజీల నిర్మాణానికి ఇంకా రూ.7,300 కోట్లు కావాలి. పీపీపీ మోడల్లో ప్రభుత్వం వెళ్తంది. రూ.7,300 కోట్లు ఖర్చు చేయాలి. మీరుపెట్టిన జీఓ ప్రకారం ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల పూర్తికి ఇంకా 15 ఏళ్లు పడుతుంది. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఇచ్చిన ఫీజు విధానం చూస్తే ఆల్ ఇండియా కోటాకు 15 శాతం పెట్టారు. 85 శాతంలో 50 శాతం కన్వీనర్ కోటా పెట్టారు. మిగిలింది 35 శాతంలో 15శాతం రూ.12 లక్షలు. మిగతాది రూ.20 లక్షల చొప్పున పెట్టారు. త్వరగా మెడికల్ కాలజీల నిర్మాణాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అది పెట్టబడుల ద్వారానే సాధ్యమవుతుంది. మీ తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డబ్బులిచ్చే విధానమే కదా. అప్పుడే ప్రభుత్వ కళాశాలలు పెట్టొచ్చు కదా.? ప్రజలకు వేగవంతంగా సేవలు అందాలన్న ఉద్దేశంతోనే పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. ఈ విధానంపై జగన్రెడ్డి తేడా తెలుసుకోవాలి. పోర్టుల్లో కూడా పీపీపీ మోడల్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్ భయం పట్టుకుంది. జగన్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఆందోళనలో ఏదేదో చేస్తున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. కేంద్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తే చాలా సమయం పడుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్ట్ను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది” అని పల్లా స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం కాకుండా కాపాడాం
“విశాఖ స్టీల్ ప్లాంట్పై జగన్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా రూ.11,440 కోట్లు సాధించాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ను మేనేజ్మెంట్, కార్మిక సంఘాలు లాభాల బాటలో తేవాల్సిన అవసరముంది. కేంద్రం, రాష్ట్రం సహకారం అందిస్తాం. 32 సెక్షన్లను ప్రైవేట్పరం చేయడం లేదు. ఇప్పటికీ కాంట్రాక్టర్లే అక్కడ పని చేస్తున్నారు. 1000 మంది 32 భాగాలుగా పనిచేస్తున్నార్నది జగన్రెడ్డి గమనించాలి. అవగాహన లేకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కల్తీ మద్యానికి ఆద్యుడు జగనే
జగన్రెడ్డి పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయని పల్లా వ్యాఖ్యానించారు. “కల్తీ మద్యం మొత్తం కుంభకోణం జగన్రెడ్డి ప్రోత్సహించిందే. కొందరు వైసీపీ ముసుగు వేసుకొని టీడీపీలోకి వచ్చారు. వాళ్లను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష వేస్తాం. తప్పు చేశారనే పార్టీనుంచి కల్తీమద్యం కేసులో సస్పెండ్ చేశాం. జగన్రెడ్డి తన హయాంలో కల్తీ మద్యం కుంభకోణం బయటపడినా ఒక్క వైసీపీ నేతపైనా చర్యలు తీసుకోలేదు” అని వైసీపీ నీతిమాలిన చర్యలను గుర్తు చేశారు.
బొత్సకు భద్రత కల్పిస్తాం
బొత్స సత్యనారాయణ అంటే మాకు గౌరవం. నాకు ప్రాణహాని ఉందని బొత్స ప్రకటించారు. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా బొత్సకు ఎటువంటి భయం అవసరం లేదు. బొత్స మాటలను బట్టి చూస్తే.. జగన్రెడ్డి వల్లే బొత్సకు ప్రాణహాని ఉందని అనిపిస్తుంది. జగన్రెడ్డిని దాటి వెళ్లినా, పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకొన్నా వాళ్లని అంతం చేస్తాడు జగన్. వైఎస్ వివేకాను ఆ కారణంగానే మట్టుబెట్టారు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారు. మండలిలోనూ ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స పనితీరు బాగుంది. బొత్సకు వైసీపీనుంచే ప్రాణ హాని ఉందని అనిపిస్తుంది. బొత్స అడిగితే.. ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాం” అని పల్లా పేర్కొన్నారు.