- ఒకేరోజు 5 కంపెనీలకు లోకేష్ భూమిపూజ
- పారిశ్రామికవేత్తలు, ప్రజల్లో ఆనందోత్సాహాలు
విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్కు ఒకరోజుముందే ఐటీ పండుగొచ్చింది. సమ్మిట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం ఒకేరోజు 5 కంపెనీలకు భూమిపూజ చేశారు. పారిశ్రామికవేత్తలతోపాటు విశాఖప్రజలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.3,800 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 30వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కంపెనీల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్కు నగర ప్రజలు నీరాజనాలు పట్టారు. భారత్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖ గూగుల్ ఏఐ హబ్ ప్రకటన తర్వాత నగరానికి ఐటీ కంపెనీలు క్యూగట్టాయి. ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, తాజాగా సైల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్వేర్, టెక్ తమ్మిన, ఫీనోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె.రహేజా, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. కారక్రమానికి హాజరైన ఎంపీ ఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెయిల్స్ సాఫ్ట్వేర్కు శంకుస్థాపన
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.2లో సెయిల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నొవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మంత్రితోపాటు కార్యక్రమానికి హాజరైన సంస్థ ఎండి, సీఈఓ కిరణ్ మాట్లాడుతూ… విశాఖలో రూ.21 కోట్లతో సెయిల్ సంస్థ ఏర్పాటు చేసే ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 430మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి అత్యాధునిక ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్పై దృష్టిసారించనున్నట్టు చెప్పారు.
ఐస్పేస్ సాఫ్ట్వేర్కు భూమిపూజ
విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెం.2లో ఐ`స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రితోపాటు హాజరైన సంస్థ సీఈవో రమేష్ మాట్లాడుతూ… విశాఖలో తమ సంస్థ మూడు దశల్లో రూ.119.18 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 2వేలమందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఐటిఓ సేవల డెలివరీ కార్యకలాపాలను తాము విశాఖ యూనిట్ ద్వారా చేపడతామన్నారు.
ఫీనోమ్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.2లో ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంస్థ కో ఫౌండర్ హరి బైర్రెడ్డి మాట్లాడుతూ… విశాఖ యూనిట్పై రెండుదశల్లో రూ.207.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు. తాము అడ్వాన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఏఐ రీసెర్చి, కస్టమర్ డెలివరీ ఎక్సలెన్స్పై దృష్టిసారిస్తామన్నారు.
రహేజా మిక్స్డ్ డెవలప్మెంట్ స్పేస్కు శంకుస్థాపన
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.3లో రహేజా సంస్థ ఐటి స్పేస్/ కమర్షియల్ స్పేస్ మిక్స్డ్ డెవలప్మెంట్ స్పేస్కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ రవి సి రహేజా మాట్లాడుతూ… విశాఖలో రూ.2,172 కోట్ల పెట్టుబడి పెట్టడంద్వారా 15వేలమందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లు, జీసీసీ కంపెనీలకు అవసరమైన ఐటి స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వెల్లడిరచారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్కు భూమిపూజ
విశాఖ యండాడలో కపిల్ గ్రూప్ అనుబంధ సంస్థ బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ఆధ్వర్యాన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కపిల్ గ్రూప్ చైర్మన్ వామనరావు మాట్లాడుతూ… విశాఖలో రెండు విడతలుగా రూ.1250 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 15వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఐటీ ఆఫీసు స్పేస్, కమర్షియల్ స్పేస్ మిక్స్డ్ డెవలప్మెంట్తోపాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల ఆకర్షణ, హైవ్యాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.















