- పీ`4 గురించి తెలియనివాళ్లే ఏదో మాట్లాడుతున్నారు
- మీ జీవితంలో ఒక్క కుటుంబాన్నైనా బాగు చేశారా?
- ఆర్థిక అసమానతలు లేకుండా చేయడమే నా జీవితాశయం
- తిరుమలలో గోవులు చనిపోయాయని అబద్ధాలు వల్లిస్తున్నారు
- దేవుళ్లపై దాడులు చేసిన వారికి ఇంత భక్తి ఎక్కడిది?
- కుట్రలను ప్రజలకు తెలిసేలా చేయకుంటే సమాజానికే నష్టం
- ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’లో సీఎం చంద్రబాబు పిలుపు
- పేదలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులకు సన్మానం
తాడికొండ (చైతన్య రథం): ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమం గురించి తెలియని కొంతమంది మాత్రమే ఏదేదో మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడేవారు మీ జీవితంలో ఒక్క కుటుంబాన్నైనా బాగు చేశారా? అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పాలకులు అధికారంలో ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయకపోగా, రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రాజకీయమంటే అబద్ధాలు చెప్పడమా? అని నిలదీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజావేదిక సభలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలకు ఎంపికైన వారి సమస్యలు విన్నారు. కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. పొన్నెకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఈ గ్రామంలో 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11మంది ముందుకు వచ్చారని వివరించారు.
దేవుళ్లపై దాడులు చేసి నీతులు మాట్లాడుతున్నారు
తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారు. దేవుళ్లపై దాడులు చేసిన మీకు వెంకటేశ్వరస్వామిపై ఇంత భక్తి ఎక్కడినుంచి వచ్చింది? తిరుమలకు వెళ్లినప్పుడు సాంప్రదాయాలు పాటించని మీరు దేవుళ్లగురించి మాట్లాడటమా? గతంలోనూ అంతే… అసలు పింక్ డైమండ్ లేకపోయినా మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. నేను రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తే అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ లేదని కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. బాబాయిని గొడ్డలితో వేసేసి గుండెపోటు అని చెప్పి, తర్వాత నేను చంపించినట్టు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ హత్య గురించి ప్రశ్నించిన చెల్లి, అడిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వివేకా హత్యలో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షులను చంపేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు సాక్ష్యులు చనిపోయారు. నేను కూడా గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మి ఒకసారి మోసపోయా.? ఆరోజే ఆలోచించి నిందితులను అరెస్టు చేసి ఉంటే ఏమయ్యేదో ఆలోచించుకోండి. మాటలు చెప్పడం సులభమైన పని… మంచి పనులకు నలుగురిని ఒప్పించడం, పేద ప్రజలకు దారి చూపించడం చరిత్ర సృష్టించడమే’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అసమానతలు రూపుమాపడం నా జీవితాశయం
2004ముందు జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామాల అభివృద్ధి కోసం తీసుకొచ్చాను. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు జన్మభూమి పిలుస్తోందని ఒక పాట కూడా రాశారు. జన్మభూమి పిలుపునందుకుని ఎంతోమంది ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి స్కూల్ బిల్డింగుల నిర్మాణాలు చేపట్టారు. పేదరికం తగ్గించి, ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలని నా జీవిత ఆశయంగా పెట్టుకున్నా. ఈ సంకల్పాన్ని సాధించి తీరుతా. నా ఆలోచన ముందు అర్థంకాదు… అర్థం చేసుకుంటే భవిష్యత్ బంగారమవుతుంది. 2004, 2019లో టీడీపీ గెలిచివుంటే మనం ఎక్కడికో వెళ్లేవాళ్లం. కానీ నాడు ప్రజలు పొరపాటు చేశారు. అవతలి వ్యక్తులు చేసే కుట్రలు, కుతంత్రాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేదంటే సమాజానికి నష్టం జరుగుతుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.