అమరావతి (చైతన్యరథం): అనంతపురంలోని చేనేత సహకార సంఘాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ అవకతవకలపై ప్రభుత్వం స్పందించిందని సభకు మంత్రి సవిత వెల్లడిరచారు. ఇప్పటికే విచారణ చేపట్టామన్నారు. సొసైటీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో చేనేతల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానమిచ్చారు. చేనేతల అభివృద్ధికి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేయనున్నట్లు తెలిపారు. నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్లో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో రూ.120 కోట్లతో నేతన్నలకు పని కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధిని కల్పించనున్నామన్నారు.
ఈ పథకాన్ని శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్హెడీసీ ద్వారా 15 శాతం సబ్సిడీతో నూలు సరఫరా చేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచామన్నారు. త్రిఫ్ట్ పథకం కింద రూ.5 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడిరచారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ చేనేతలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నామని, ఇందుకోసం బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. 2024-25లో రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. త్రిఫ్ట్, ముద్రా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో చేనేతలకు రూ.138 కోట్లు కేటాయించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటు
త్వరలోనే చేనేత సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించనున్నామని మంత్రి సవిత తెలిపారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన వీవర్ శాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా కర్నూలు, విజయనగరం ఎంపీలు తమ నియోజక వర్గాల్లో వీవర్ శాలల ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారన్నారు. ఆప్కో ద్వారా నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి సవిత తెలిపారు.