- తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీలా స్పందించండి
- వరుస మరణాలపై మరింత లోతైన పరిశోధన
- శని, ఆదివారాల్లో 42 వైద్య పరీక్షలు నిర్వహించాలి..
- 72 గంటల వ్యవధిలో హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం కావాలి
- కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి
- గ్రామస్థులలో ఆరోగ్య నమ్మకాన్ని పెంచాలి..
- వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి, అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ గ్రామంనుంచి 20మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని… ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని సీపం అధికారులకు సూచించారు. అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శని, ఆదివారాలు ప్రత్యేక వైద్య బృందాలను తురకపాలెం పంపించాలని… గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారంనాటికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి… దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలన్నారు. అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.
కేంద్ర వైద్య బృందాల సాయం తీసుకోండి
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించండి. అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా వ్యవహరించండి. తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించండి. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించండి. ప్రతి రోగినీ వైద్య పర్యవేక్షణలో ఉంచాలి. హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలి. కొత్త కేసులు ఏమాత్రం నమోదుకాకూడదు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలి. స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలి. జ్వరంతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి’ అని సీఎం ఆదేశించారు.
72 గంటల్లో రిపోర్టులు
మరోవైపు తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే ‘మెలియోయిడోసిస్’ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. రక్త నమూనాలు ల్యాబులకు పంపడం జరిగిందని… 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పశుపోషణపైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని… అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడంవంటి లక్షణాలు ఎక్కువమందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. యాంటిబయోటిక్స్ ఆరువారాలు నిరంతరాయంగా వాడటంవల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు.
మెలియోయిడోసిస్ ప్రధానంగా భూమిలోనూ, నిల్వ నీటిలో, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు… వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు… రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా గాయాలు లేదా చర్మపగుళ్లు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. కాలుష్య నీరుతాగినా, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా సంక్రమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.










