- టెక్నాలజీని అందుకున్న దుబాయ్ అభివృద్ధి సాధించింది
- 2047నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం
- అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం
- ఏపీలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం..
- పోర్టుల నుంచి ఎయిర్పోర్టుల వరకూ మౌలికసదుపాయాలున్నాయి
- పెట్టుబడుల ఆకర్షణకే పాలసీలు తెచ్చాం.. తెస్తున్నాం
- ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం..
- విశాఖలో నిర్వహిస్తోన్న పార్టనర్ షిప్ సమ్మిట్కు ఆహ్వానం
- దుబాయ్లోని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోకు హాజరైన ముఖ్యమంత్రి
దుబాయ్ (చైతన్య రథం): మానవాళి భవిష్యత్ ఇన్నోవేషన్లు.. వినూత్న ఆలోచనలపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆధునిక యుగంలో టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, అందుకు దుబాయ్ సాధించిన అభివృద్ధి కళ్లముందున్న దృశ్యమన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, విశాఖ పార్టనర్షిప్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు మూడు రోజుల దుబాయ్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తొలిరోజు కార్యక్రమంలో చివరిగా దుబాయ్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోకు హాజరైన యూఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీలోని వనరులు, పెట్టుబడుల ఆవరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దుబాయ్ దేశం టెక్నాలజీని అందిపుచ్చుకునే అభివృద్ధి చెందిందన్నారు. టెక్నాలజీతో వచ్చే లాభాలను ముందుగా అర్థం చేసుకునే తాను ఐటీని ప్రమోట్ చేశానని, నాడు ఐటీని అందిపుచ్చుకున్నవాళ్లే ఇప్పుడు పెద్దఎత్తున ఐటీ దిగ్గజాలుగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు.
2047నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని వివరిస్తూ.. తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ 2071నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవడం అద్భుతమని ప్రశంసించారు. భవిష్యత్ అంతా ఇన్నోవేషన్లు.. వినూత్న ఆలోచనలదేనంటూనే.. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడులకు సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం తెలుపుతామని, ఆసక్తివున్న సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైనా… అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూనే.. రాయలసీమలో హర్టీకల్చర్, తీరప్రాంతాల్లో ఆక్వా కల్చర్ రంగాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గివ్బ్యాక్ పాలసీని అమలు చేస్తున్నామని చెబుతూ.. అందరూ ఆ పాలసీని అమలు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలో రూ.100కోట్లతో గ్రంథాలయ నిర్మాణానికి విరాళమిచ్చేందుకు ముందుకొచ్చిన శోభా గ్రూప్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను శోభా గ్రూప్ ప్రతినిధులను ఎప్పుడూ కలవలేదు. కానీ ఏపీకున్న క్రెడిబులిటీవల్ల విరాళం ఇచ్చేందుకు శోభా గ్రూప్ ముందుకురావడం సంతోషంగా ఉంది’’ అని సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో పార్టనర్ షిప్ సదస్సు నిర్వహిస్తున్నామని, పారిశ్రామికవేత్తలంతా సదస్సుకు హాజరై ఏపీ భవిష్యత్ ప్రణాళికలు, ఆలోచనలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెబుతూ.. అన్ని వసతులు ఉండడమే కాదు, ప్రకృతితో మమేకమయ్యేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. వినూత్న పద్ధతుల్లో రాజధాని కోసం భూసమీకరణ చేపట్టామని, ఒక్క పిలుపుతో 33 వేల ఎకరాలు రాజధానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతుల త్యాగాలను ప్రస్తావించారు. స్వయం సమృద్ధిగల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు చెబుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి రంగానికీ నీటి భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారతదేశ భవిష్యత్ అద్భుతంగా ఉండేలా ప్రధాని మోదీ అద్భుతమైన మార్పులు చేస్తున్నారని ప్రస్తావిస్తూ.. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ సిద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే మేం ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘‘పరిశ్రమలకు అనుకూలంగా ఉండేందుకు పాలసీలు తెచ్చాం, తెస్తున్నాం. ఇప్పటికే 24 పాలసీలు తెచ్చాం. అవసరమైతే మరిన్ని పాలసీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమల స్థాపనకు వచ్చే ప్రతిపాదనలతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తే.. వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నామని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రంలో పోర్టులున్నాయి. ఎయిర్ పోర్టులున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా హార్బర్ ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. లాజిస్టిక్స్ హబ్ చేసేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రస్తుతం ఏడు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. మరో 9 ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కార్గో రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేస్తున్నాం. జల, రైలు, రోడ్, వాయుమార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నాం. వన్ ఫ్యామిలీ -వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నాం. ఇందుకోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశాం’’ అని
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
‘‘దుబాయ్ దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందింది. దుబాయ్ దేశ జనాభా 3 మిలియన్లు. కానీ ఈ దేశాన్ని ఏడాదిలో సందర్శించే పర్యాటకుల సంఖ్య 18 మిలియన్లు. అదీ పర్యాటక రంగానికున్న బలం. ఇప్పుడు ఏపీలోనూ పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ప్రాంతాలే కాకుండా… ఆధ్యాత్మిక, చారిత్రాక ప్రాంతాలూ మాకు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి దివ్యక్షేత్రం ఏపీలోనే ఉంది. 7 యాంకర్ హబ్స్… 25 థిమెటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులిచ్చాం. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. ఆర్సెల్లార్ మిట్టల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. గూగుల్ కూడా 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులను విశాఖలో పెట్టేందుకు ముందుకొచ్చింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 48 యూనివర్శిటీలున్నాయి. 9 జాతీయ విశ్వవిద్యాలయాలున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నాం. మైక్రో సాఫ్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి జరగబోతోంది. సంస్కరణలు అమల్లోకి వచ్చాక… అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెడుతోంది. విశాఖనుంచే చాలా దేశాలకు కనెక్టివిటీ ఇస్తారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీలకు కేంద్రంగా ఉండబోతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలున్నాయి. ఏపీకి రండి. రాష్ట్రంలోవున్న అవకాశాలను అధ్యయనం చేయండి. ఆ తరువాతే పెట్టుబడులు పెట్టండి’’ అని పారిశ్రామికవేత్తలకు సీఎం
చంద్రబాబు రెడ్కార్పెట్ పరిచారు.
దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీపం చంద్రబాబు రాష్ట్ర ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు అద్భుతంగా ప్రతిస్పందించారు. సీఎం ప్రజెంటేషనుకు పారిశ్రామికవేత్తలు స్టాండిరగ్ ఓవేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని అవకాశాలను వివరిస్తూ… పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు… గనులు మొదులుకుని స్పేస్ టెక్నాలజీ వరకు… చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రంగా వివరించటంలో విజయం సాధించారు. పెట్టుబడుల గురించే కాకండా… ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనాంశాలను గురించీ సీఎం చంద్రబాబు బలంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖలో నవంబర్లో నిర్వహించనున్న పార్టనర్షిప్ సమ్మిట్కు తప్పక హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను, దుబాయ్ అధికార యంత్రాంగాన్ని సాదరంగా ఆహ్వానించారు.













