- ప్రాజెక్ట్ నిర్వహణ, కాలువల పనులపై దృష్టి
- మీడియాతో జలవనరుల మంత్రి నిమ్మల
అమరావతి (చైతన్యరథం): వందల, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే గత వైసీపీ ప్రభుత్వం సరైన నిర్వహణ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళవారం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు రూ.344 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం రూ.10లక్షలు దాటితే, కాలయాపన చేయకుండా, 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా, షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామన్నారు. రూ.10లక్షల్లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి కూడా తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయలేదని, గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో రూ.90 కోట్లతోనూ, సెప్టెంబర్లో అత్యవసర పనులకు గానూ రూ.326 కోట్లతో నిర్వహణ పనులు చేశామని అన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.