- తుపాన్ల ముప్పు తప్పేలా పంటకాలం ముందుకు జరగాలి
- శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్ -వాటర్ మేనేజ్మెంట్
- 365 రోజులూ పంటలతో రాష్ట్రం విరాజిల్లాలి
- జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- బుడమేరులో పూడిక తొలిగించాలని అధికారులకు ఆదేశం
- పిజియో మీటర్లు, సెన్సార్లకు రూ.30 కోట్లు కేటాయింపు
అమరావతి (చైతన్య రథం): కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాన్లకంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా… 3 పంటలు నిరంతరం పండిరచేలా చూడాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజియో మీటర్లు, ఇంకా ఏడబ్ల్యుఎస్ సెన్సార్లు రాష్ట్రంలో కొన్నిచోట్ల పనిచేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.30 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిర్వహణా లోపాలు సరిచేసుకుని వాటర్ ఆడిట్ శాస్త్రీయంగా చేపట్టాలని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
భూగర్భ జలాల వివరాలతో బులిటెన్లు
శుక్రవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘జలవనరుల లభ్యతను బట్టి నీటి సమర్ధ వినియోగం జరగాలన్నారు. భూగర్భ జలాలు 20 మీటర్లకన్నా తక్కువ ఉన్న మండలాలు, 8-20 మీటర్ల మధ్య భూగర్భ జలాలున్న మండలాల వివరాలు అందించాలి. బేసిన్లు, జిల్లాలవారీగా, సెంట్రల్- లోకల్ బులిటెన్లు రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో సగటు భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సీలేరు నీరు కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలి. హంద్రీ-నీవా మెయిన్ కెనాల్ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి. వెలిగొండ స్టేజ్ 1 పనులు 2026 జూన్కల్లా పూర్తి కావాలి. కేంద్ర ఆర్ధిక సాయం కోసం సాస్కిలో పెట్టండి. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టండి. బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడికతీత, ముళ్ల కంపలు తొలిగించండి. ఒక్క ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా… ఆ నీటితో 3, 4 ఏళ్లు కరువొచ్చినా వాటర్ మేనేజ్మెంట్ జరగాలి. క్రాప్ ప్యాట్రన్ మార్చి… తడి-ఆరుతడి పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి. జల సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం-బనకచర్లకు త్వరలో టెండర్లు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ-పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే, టెండర్లకు సంబంధించిన రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరుకల్లా పూర్తికావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
బనకచర్లకు రుణ సమీకరణ ఇలా..
జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా, దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ధిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ.81,900 కోట్ల వ్యయంలో 50శాతం అంటే రూ.40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ :
మరోవైపు పోలవరం ప్రాజెక్టు సివిల్ నిర్మాణం పనులు ఇప్పటివరకు 81.70 శాతం పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే చేయగా, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో 5.93 శాతం పనులు జరగడం విశేషం. డయాఫ్రమ్ వాల్ 64 శాతం, బట్రెస్ డ్యామ్ 91శాతం, ఇసుక గట్టి పరిచే వైబ్రో కంప్రాక్షన్ పనులు 54 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తికానుంది. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కాంట్రాక్టర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీసీ ఎల్ ఏ జయలక్ష్మి హాజరయ్యారు.