- పంటల బీమాపై నిస్సిగ్గుగా జగన్ అబద్ధాలు
- మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుయుక్తులు
- బుద్దిలేకుండా, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు
- రాష్ట్రంలో 95% ఈ క్రాప్ నమోదు, నవంబర్ 12 లోపు మిగిలిన 5% పూర్తి
అమరావతి (చైతన్యరథం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మళ్లీ అబద్ధాల తుపాను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ, సహకార, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. తుపాను ప్రభావం, పంటల నష్టంపై మాట్లాడే ముందు జగన్ తన పాలనలో రైతులకు చేసిన అన్యాయాలను గుర్తు చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం పేరుతో మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదన్నారు. పంటల బీమాపై జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులకు సాయం చేసిందెవరో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని జగన్కు మంత్రి సవాల్ విసిరారు. జగన్ పాలనలోనే రైతులు కష్టాల బాట పట్టారు. ఉచిత పంట బీమా పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. బీమా కోసం రైతులు నెలల తరబడి తిరిగినా, ఒక్క రూపాయి పరిహారం కూడా అందలేదు. ఇప్పుడు సిగ్గు లేకుండా బీభత్సమైన గణాంకాలు చెప్పి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ పేర్కొన్న ఇ-క్రాప్, ఆర్బీకే, సచివాలయ వ్యవస్థలు కేవలం రాజకీయ ప్రదర్శనలేనని, వాస్తవంలో వాటి ఫలితం శూన్యమని మంత్రి తేల్చిచెప్పారు. మీ పాలనలో రైతులు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. మిర్చి, మామిడి, పొగాకు కొనుగోళ్లు చేస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. రైతుల చెమటను చెల్లని వాగ్దానాలతో తుడిచేందుకు ప్రయత్నించిన అసమర్థ పాలన జగన్దే అని మంత్రి విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన నష్టం అంచనా వేయించి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, తక్షణ సహాయ చర్యలు, బీమా పరిహారాలు అందజేస్తోందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైతు కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మాటలు కాదు చర్యలతో మేము నిరూపిస్తున్నామని అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95% ఈ క్రాప్ నమోదయిందిని, నవంబర్ 12 లోపు మిగిలిన 5% పూర్తి చేస్తామన్నారు.
రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు కష్టసుఖాల్లో అండగా నిలవడం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్న పంటలకు వెంటనే మార్కెట్ జోక్యం కింద సాయం అందించేందుకు ప్రభుత్వం 2025`26 సంవత్సరానికి రూ.300 కోట్లను బడ్జెట్లో మంజూరు చేసిందన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.800 కోట్ల వరకు పంటల మద్దతు ధరల కోసం ఖర్చు పెట్టాం అని మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో 2020లో మిర్చి ధర రూ.12,000 ఉన్నా, మద్దతు ధరగా రూ.7,000 మాత్రమే నిర్ణయించి, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మంత్రి మండిపడ్డారు. హెచ్డీ బర్లీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు తమ ప్రభుత్వం రూ.271 కోట్లు వెచ్చించి 20 వేల మిలియన్ కిలోల కొనుగోలుకు నిర్ణయం తీసుకుందని, అదనంగా వచ్చిన పంట కూడా కొనుగోలు చేశామన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. కోకో ధరలు తగ్గడంతో కిలోకు రూ.50 చొప్పున అదనంగా చెల్లించాం. తోతాపూరి మామిడి ధరలు తగ్గినప్పుడు రూ.260 కోట్లు వెచ్చించి ప్రతి కిలోకు అదనంగా రూ.4 చొప్పున చెల్లించాం. టమాటా రైతులకు ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైన ధరలు అందించడానికి రూ.8 కోట్లు వెచ్చించి రైతుల వద్ద నుండి 1781 మెట్రిక్ టన్నులు సేకరించి రైతు బజార్ల ద్వారా విక్రయించాం.
అలాగే ధరలు తగ్గినప్పుడు రూ.3.25 కోట్లతో సుమారు 2800 మెట్రిక్ టన్నుల టమాటా కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించాం. 2019`24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 3780 మెట్రిక్ టన్నుల టమాటా సేకరించగా, మా ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే 4672 మెట్రిక్ టన్నులు సేకరించిందన్న విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు తగ్గిన నేపథ్యంలో, మా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల ద్వారా రూ.1200 క్వింటాకు కొనుగోలు చేసింది. ఉల్లికి హెక్టార్ కి రూ.50,000 ఇచ్చిన ప్రభుత్వం మాదే. కూటమి ప్రభుత్వం రైతు కష్టానికి అండగా ఉంది. మిర్చి కి రూ.11781 రూపాయలుకి కొంటామని చెప్పి కొనలేదని విమర్శిస్తున్నారు. అంటే మద్దతు ధరకు మించి మార్కెట్లో రూ.14000 నుండి రూ.15000 పలుకుతుంటే రైతు దగ్గర తక్కువకి కొని రైతుని ముంచేయమనేది జగన్ ఉద్దేశ్యమా అని ఎద్దేవా చేశారు. రైతు ఉత్పత్తికి విలువ, శ్రమకు గౌరవం కల్పించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మాటలు కాదు చర్యలతో రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
 
	    	 
 














