- ప్రజలకు మంత్రి లోకేష్ భరోసా
- కడప బుగ్గలేటిపల్లిలో 69వ రోజు ప్రజాదర్బార్
- మంత్రి లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు
- వినతుల స్వీకరణ.. పరిష్కరిస్తామని హామీ
కడప (చైతన్యరథం): పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్లో 69వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయండి
కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేస్తూ.. కూలి పనులు చేస్తూ జీవనం సాగించుకునే తాము ఎలాంటి ఆధారం లేక బుగ్గమక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలను చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. సదరు వ్యవసాయ భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లాలో మండల పరిషత్ కార్యాలయంలోని ఉపమండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న మండలస్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు (వీూజూం) జీతాలను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా చెల్లించాలని పంచాయతీ రాజ్ మండల లెవల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సీకే దిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో 2008లో ఏపీఐఐసీ సేకరించిన అరెకరం భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని, పరిశీలించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన చమిడిరెడ్డి జనార్థన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సిద్ధవటం, అట్లూరు, బద్వేలు మండలాల ప్రజల చిరకాల కోరిక అయిన కడప-పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నానదిపై ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లె మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్.మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కడప నగరంలో వేలాదిగా ఉన్న రజక కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని అక్కాయపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.