- నలుగురిని చదివించేందుకు ముందుకొచ్చిన విదేశీ విద్యా పథకం లబ్దిదారుడు సాత్విక్
- విదేశీ విద్యపై ఆసక్తివున్న పేదలకు అండగా ఉంటానంటున్న సాత్విక్
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వమిచ్చే సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ పథకాలకు సార్థకత చేకూరుతుంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఆ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. నాడు ఆర్థిక సాయం పొందిన చేతులు.. ఇప్పుడు పేదలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి కలిశారు. 2016లో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండులో చదువుకోవడానికి నాటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని ముఖ్యమంత్రికి సాత్విక్ వివరించారు. ప్రభుత్వం అందించిన సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్లో ఐర్లాండులో ఎంఎస్ విద్యను అభ్యసించానని చెప్పారు.
తర్వాత అక్కడే ఉద్యోగం చేసిన తాను.. ఇప్పుడు ఐర్లాండులో వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నాడు ప్రభుత్వంనుంచి సాయం పొందిన తాను.. ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దశంతో ఉన్నట్టు సాత్విక్ చెప్పారు. ఈమేరకు మెరిట్ కలిగిన పేద విద్యార్థులను ఎంపికచేసి విదేశాల్లో వారికి చేయూతనిచ్చేలా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు చెప్పారు. ఈమేరకు తాము నలుగురు పేదలకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సాత్విక్ను సీఎం చంద్రబాబు అభినందించారు. తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన యువకుడిని ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ ఉన్నారు.