అమరావతి (చైతన్యరథం): భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషకరమన్నారు. బెలూం గుహలను పురాతన సంస్కృతీ నిలయాలుగా అభివర్ణించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా ఈ గుహలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయన్నారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు స్థానం దక్కుతుందన్నారు. ప్రపంచంలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు.