- మామిడి రైతులు- పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి
- మామిడి కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని పరిశ్రమలకు ఆదేశం
- అదనపు ధర ఇచ్చిన ప్రభుత్వానికి మామిడి రైతుల ధన్యవాదాలు
- ఉమ్మడి చిత్తూరు మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమలతో సీఎం భేటీ
కుప్పం (చైతన్య రథం): మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రైతులనుంచి తక్షణం మామిడి కొనుగోలుచేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపునుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఉత్పత్తి ఇంకా రావాల్సి ఉందని సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోడానికి స్థలం లేదని పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్నిచోట్ల అన్ లోడిరగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రల ప్రతినిధులకు సూచించారు.
మరోవైపు పాకిస్తాన్, ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు సీఎంకు తెలిపారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతంనుంచి 5 శాతానికి తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు 6-12 టన్నులమేర మామిడి ఉత్పత్తి వచ్చిందని రైతులకు మంచి ధర రావాలని, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమకు వయబిలిటీ రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్ధులకు మూడు రోజులపాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి పండిరచండి
మామిడి పంటలో ఎరువులు, పురుగుమందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రం నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేస్తోందని.. మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్, ట్రేసింగ్, సర్టిఫికేషన్ వచ్చిందని .. మన ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు వారి సామర్ధ్యానికి తగినట్టుగా రైతులనుంచి మామిడి కొనుగోలు చేయాలని.. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు రూ.8 ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారి మాయలో పడొద్దని సీఎం రైతులకు హితవు పలికారు.