- కనీస నిధులు కూడా కేటాయించలేదు
- పరిస్థితులు చక్కదిద్దుతామని మంత్రి నిమ్మల హామీ
కర్నూలు (చైతన్యరథం): జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో.. పోలవరం నుంచి గోరకల్లు వరకు ఇరిగేషన్ వ్యవస్థ అతలాకుతలమైపోయిందని కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసానికి గురైన ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము ఎంతో కష్టపడాల్సి వస్తోందన్నారు. జిల్లాలోని గోరకల్లు రిజర్వాయర్ను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టం ఎక్కువ అన్నారు. వైకాపా పాలనలో గోరకల్లు రిజర్వాయర్కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం, మిగిలిన పనులు చేయకపోవడం వల్ల రిజర్వాయర్ ఉనికికే ప్రమాదం వాటిలిందన్నారు. దీనితో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయలేకపోతున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో అతి ప్రధానమైన గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే మిగతా రిజర్వాయర్లకు నీరు వెళ్తుందని మంత్రి నిమ్మల వివరించారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు సైతం నీరందించాలన్నా గోరకల్లే ముఖ్యం. అలాంటి గోరకల్లుకి జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ద్రోహం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంతప్పిదాలు సరి చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.58 కోట్ల అంచనాలతో ఆర్థికశాఖ కు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి రామానాయుడు చెప్పారు. గోరకల్లు ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రికి వివరించి నిధులు మంజూరు చేయించడం ద్వారా బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తామన్నారు.
రాయలసీమకు వరప్రసాదం శ్రీశైలం
రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తుకొస్తారని మంత్రి రామానాయుడు అన్నారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయుంచి పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. వైసీపీ హయాంలో పులిచింతల గేట్లు , గుండ్లకమ్మ, పింఛా డ్యామ్ , అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సంగతి ఆయన గుర్తు చేశారు. పింఛా డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి, వరద వస్తున్నా అక్రమ ఇసుక తవ్వే యంత్రాలను కాపాడుకోవడం కోసం వైకాపా మాఫియా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేశారన్నారు. 41 మంది అమాయకులు చని పోవడానికి వైకాపా ఇసుక మాఫియా నే కారణమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హంద్రీనీవాకు అధిక ప్రాధాన్యం
హంద్రీనీవా ప్రాజెక్ట్లో మోటార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా పనులు చేస్తున్నామన్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 3800 కోట్లు నిధులు కేటాయించి హంద్రీనీవాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. అధికార మార్పిడి వల్ల జరిగే అనర్థం అంతా ఇంతా కాదని.. 2019లో కూడా మన ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉండేవన్నారు. అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు ఉండాలని రామానాయుడు కోరారు. సమర్థత గల చంద్రబాబు నాయుడు, ప్రగతిని కోరుకునే పవన్ కళ్యాణ్,. వీరికి కేంద్రం నుంచి సహకరించే ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, వీరి నాయకత్వం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రజలు అండగా నిలవాలని మంత్రి రామానాయుడు కోరారు.