- ధాన్యం పాత బకాయిల చెల్లింపులకు నిధులు
- రూ.672 కోట్లు విడుదలకు సర్కారు ఓకే
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర రైతాంగానికి మంత్రిమండలి తీపి కబురు చెప్పింది. ధాన్యం పాత బకాయిలు రూ.వెయ్యికోట్లలో రూ.672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీ ఈమేరకు నిర్ణయించింది. బకాయిల సొమ్మును నిధులు విడుదలైన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించడం గమనార్హం. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్కి ప్రభుత్వం అప్పగించింది. ప్రజా పంపిణీ అవసరాలకు పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈవారంలోనే రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిల సొమ్ము జమయ్యే అవకాశముంది.
కేబినెట్ నిర్ణయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.672కోట్లు విడుదలకు మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. దీనివల్ల దాదాపు 32 వేలమంది రైతులకు లబ్ది చేకూరుతోందన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండిరగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.