- వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఆ నిధులే కీలకం
- ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వినతి
- జలవనరుల మంత్రి పాటిల్తోనూ సమావేశం
ఢిల్లీ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ కు వినతిపత్రం
సమర్పించారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ
ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా
కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం తన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనమిక్ డెవలప్మెంట్కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ను కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం పనుల పురోగతిని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.
ఏపీ అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశాను. పూర్వోదయ పథకం కింద మద్దతు కోరాను. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి మేము ప్రణాళికలు వేస్తున్నాము. -సీఎం చంద్రబాబు నాయుడు