- సేద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
- రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యాలు
- మద్దతుధరల కల్పనకు సర్కారు శ్రమిస్తోంది
- అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నాణ్యత చూడండి
- నేటినుంచే పొగాకు కొనుగోలుకు చర్యలు
- మామిడి, కోకో పంటలపైనా లోతైన చర్చ
- ఏ పంటలు వేయాలో అధికారులే సూచించాలి
- ధరలు లేనపుడు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలి
- వ్యవసాయ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- కోకో, మామిడి, పొగాకు గిట్టుబాటు ధరలపై సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సేద్యంపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఉందన్న భరోసా రైతులకు కల్పించాలని సీఎం చంద్రబాబు అదికారులకు సూచించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలని దిశానిర్దేశం చేశారు. కోకో, మామిడి, పొగాకుపంట ఉత్పత్తుల గిట్టుబాటు ధర, కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే.. అనుకున్న సమయంలో సాయం చేయడంతో పాటు, ఫీల్డ్కువెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని, ఏవిషయంలోనూ రైతుల్లో అసంతృప్తి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు సమస్యలను ముందుగానే అంచనా వేసి, అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కోకో పాలసీ తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తూ.. పంట ఉత్పత్తుల్లో మంచి నాణ్యత ఉండేలా రైతుల్ని చైతన్యపర్చాలని అధికారులకు సూచించారు. ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండేలా చూడాలి. ఎఫ్పీవోలు, ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా… ప్రాసెసింగ్ జరిగేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు.
పొగాకు కొనుగోళ్లపై కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎఫ్సీవీ పొగాకు రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టుబాకో బోర్డు నిర్ణయించాలని సూచించారు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్డీ బర్లీ (బ్లాక్ బర్లీ) రకానికి ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాల్లో రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు చర్చించి అపరాలు, చిరుధాన్యాలు పండిరచేలా ప్రోత్సహిస్తే.. మద్దతు ధర సమస్యను కొంతవరకు పరిష్కరించుకోగలుగుతామన్నారు. పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు… ఈ ఏడు మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోలు కోసం ఇప్పటికే సిద్ధం చేశారని, వెంటనే కొనుగోళ్లు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హెచ్డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ కలిసి 25 మిలియన్ కేజీల వరకు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్డీ బర్లీ పొగాకులో సెకెండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ రకాలు కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపించడం లేదన్న సమాచారం తనకు అందిందని అంటూనే.. సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
మామిడి పంటపై సమీక్షలో.. 43 వేల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయిన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి అధికార్లు తీసుకొచ్చారు. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీకో తదితర సంస్థలనుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైందని వివరించారు. వ్యాపారులు కేజీ మామిడి రూ.12కి తక్షణం కొనుగోలు చేయాలని, వ్యాపారులు కనీసం రూ.8చెల్లిస్తే… రాష్ట్ర ప్రభుత్వం కేజీకి రూ.4 రైతులకు నేరుగా చెల్లిస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. అయితే రైతులు, ట్రేడిరగ్ కంపెనీలు, ప్రాసెసర్లు అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రైతులు, ట్రేడర్, ప్రాసెసర్… రికార్డులు మెయింటైన్ చేయాలని అధికార్లకు సూచించారు.
కోకోపై సమీక్షిస్తూ.. ఇప్పటికే రైతుల దగ్గరనుంచి 465 మెట్రిక్ టన్నులు కోకో కొనుగోలు చేయగా, ఇంకా 745 మెట్రిక్ టన్నుల కోకో ఉత్పత్తి రైతుల దగ్గర మిగిలివుందని అధికార్లు వివరించారు. రైతులకు కనీసం కేజీకి రూ.500 గిట్టుబాటు అయ్యేలా చూడాలని నిర్ణయిస్తూ.. కంపెనీలు కేజీ రూ.450 చెల్లిస్తుండగా, అదనంగా మరో రూ.50 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్న విషయాన్ని సమీక్షలో చర్చించారు.
పంటలు, రెయిన్ ఫాల్, డిమాండ్, వాటర్ సేవింగ్వంటి డేటాను దృష్టిలో పెట్టుకుని రైతులు ఏయే పంటలు సాగుచేయాలో ముందుగానే రైతులకు అధికారులు సూచించాలని సీఎం ఆదేశించారు. క్రాప్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని, అందుకు ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించి…. డిమాండ్ను అంచనావేసి.. వ్యవసాయం లాభసాటి చేయాలని సీఎం సూచించారు. అనుకోని పరిస్థితుల్లో ధర రాకుంటే ప్రభుత్వం ఆదుకునేలా ఉండాలని, శుక్రవారంనుంచే పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లు ముమ్మరం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతమున్న 116 రైతు బజార్లను 200కి పెంచాలని, మొబైల్ మార్కెట్లటూ ప్రవేశపెడదామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలంటూనే.. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలని అధికారులకు సూచించారు. పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాత జాబితాను రూపొందించి పొరపాట్లు దొర్లకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలని, సమస్య పరిష్కారమయ్యేవరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలని ఆదేశించారు. క్రాప్ డేటా పకడ్బందీగా తయారు చేయాలని సూచిస్తూ.. ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రాష్ట్ర రైతాంగానికి అందేలా చూడాలని జాగ్రత్తలు చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులున్నా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పనకు సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. పొగాకు విషయంలో పొగాకు బోర్డు…. బోర్డు తిప్పేసేలా వ్యవహరించకూడదని హెచ్చరిస్తూనే.. రైతులను సరైన రీతిలో మార్గదర్శనం చెయ్యాలని కోరారు. ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులను మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు.. సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి పామాయిల్పై కేంద్రం తగ్గించిన దిగుమతి సుంకం రైతులకు ఏవిధంగా నష్టపరుస్తుందో చెప్పి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.