- మంత్రి డోలా ఉద్ఘాటన
- ఐదేళ్ల పాలనలో పొగాకు రైతుకు జగన్ ద్రోహం
- ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే నమ్ముతారా
- ఏరువాక కార్యక్రమంలో నాగలి పట్టి దుక్కిదున్నిన మంత్రి
ఒంగోలు (చైతన్యరథం): విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ పొగాకు బోర్డు ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు త్రోవగుంటలో వేరువేరుగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలలో మంత్రులు డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగలితో పొలం దున్ని రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్రంలో పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ…. ఒక రైతు బిడ్డగా అన్నదాతల కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ను కూడా తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ దిశగానే అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
గతంలో రైతులకు వ్యక్తిగతంగా అండగా ఉండేలా రాయితీపై పరికరాలను తమ ప్రభుత్వం అందించిందన్నారు. నేడు కూడా రాయితీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందించేందుకు 146 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. మ్యాచింగ్ గ్రాంట్స్ లేని కారణంగా గత ప్రభుత్వంలో నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తమ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20వ తేదీన అమలు చేసి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుతామని మంత్రి చెప్పారు. ఏం మొహం పెట్టుకొని జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారని మంత్రి నిలదీశారు. 5 ఏళ్ల పాలనతో పొగాకు రైతులను దగా చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలోనే పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత5 ఏళ్ళు రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్ముతారా? బర్లీ పొగాకు క్వింటా రూ.12 వేలకు కొంటున్నారు. పొగాకు రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే. 2016లో పొగాకు ధరలు పడిపోతే కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా రైతులకు క్వింటాకు రూ.2 వేలిచ్చామని మంత్రి డోలా తెలిపారు.
రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కి లేదని, పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే జగన్కి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల క్రమబద్ధీకరణ పేరుతో గతంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పారు. పొగాకు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లోగ్రేడు పొగాకును కూడా కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని పొగాకు బోర్డు చైర్మన్ను మంత్రి కోరారు. ఇప్పటికే మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పొగాకుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులెవరూ కూడా నష్టపోకుండా ధరల స్థిరీకరణ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బి.ఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా కూటమి నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.