- ఒకే రోజు 32 మంది విద్యార్థులు
- విద్యావ్యవస్థలో సంస్కరణల ఫలితం
- మంత్రి నారా లోకేష్ అభినందనలు
అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విద్యారంగంలో సంస్కరణలతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో చోటు చేసుకుంది. ఒకేరోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠ శాలకు మారారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విద్య శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేప ట్టారు. ఆ క్రమంలో గత ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15 వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తున్నారు.
విద్యా రంగంలో మార్పు మొదలైంది: లోకేష్
ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైంది. విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా నేను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకేరోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.