- ఉదయం, సాయంత్రం రెండు పూటలా అందుబాటులో
- కొత్త విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందజేసే విధానం అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక నుంచీ ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో చౌకధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 8 గం.ల నుంచి 12 గం.ల వరకు అలాగే సాయంత్రం 4గం. ల నుండి 8 గం.ల వరకు రేషన్ డీలర్లు.. కార్డుదారులకు సరుకులు అందిస్తారన్నారు.
గత ప్రభుత్వం చౌక ధరల దుకాణాలు మూసేసి, ఇంటింటికి సరుకులు అందిస్తాం అని ఆర్భాటం చేసి ఆచరణలో విఫలమయిందన్నారు. రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికీ వెళ్లి ఇవ్వకుండా నెలలో 1-2 రోజులు మాత్రమే కూడళ్లలో వాహనం నిలిపి అక్కడికే వచ్చి సరుకులు తీసుకోమనడంతో ఎంతోమంది పేదలకు సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. అంతే కాకుండా రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు, ఇకపై కార్డుదారులకు రేషన్ డిపోల్లోనే డీలర్ల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జనరంజకంగా అమలవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆకాంక్షించారు.