- ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్
- గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం
- దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం
- బాబు సూపర్ సిక్స్లో మరో హామీ ‘తల్లికి వందనం’ నిలబెట్టుకున్నాం
- ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు
- సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిపై కూటమి ప్రభుత్వ ప్రయాణం
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మాపై ఉంది
- ఏడాది పాలనపై విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి (చైతన్యరథం): సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండిపై కూటమి ప్రభుత్వ ప్రయాణం కొనసాగుతోందని అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తిచేసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిరది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. తాజాగా 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం
గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకువచ్చాం. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉంది. 16శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం. రైల్వేజోన్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతినెలా రూ.15వేలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలుచేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించింది, గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
బాబు సూపర్ సిక్స్లో తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నాం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలుచేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేశాం. నగదు తల్లుల అకౌంట్లలో జమవుతుంది. రూ.13వేలు తల్లుల అకౌంట్లలో పడతాయి. రూ.2వేలు పాఠశాలల్లో మెయింటెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేస్తాం, తల్లికి వందనం కింద దాదాపు 60శాతం కుటుంబాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. వారికి ఇద్దరుంటే రూ.26వేలు, ముగ్గురుంటే రూ.39వేలు వస్తాయి. వారి అకౌంట్లలోనే నగదు జమచేస్తాం. బాబు సూపర్ సిక్స్ లో మరొక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి లోకేష్ చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లు
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటిది. మాకు ప్రజలు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు. ఓ వైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ.. ప్రజలు ఏ ఆశతో కూటమికి 94శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత తమపౖౖె ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.