- బీహార్ యువతకు మంత్రి లోకేష్ పిలుపు
- ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది… బీహార్లో అటువంటి పరిస్థితి రావద్దు
- జంగిల్ రాజ్ పోయి నితీష్ వచ్చాకే బీహార్లో పెద్దఎత్తున అభివృద్ధి
- వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర కీలకమైంది
- పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్
పాట్నా/బీహార్ (చైతన్యరథం): వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది.. బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు ఎన్డీఏను గెలిపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రజలకు, యువతకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ వెళ్లిన లోకేష్… ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తాను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు.. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చానన్నారు. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది. బీహార్ యువత మరోమారు ఎన్డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్డీఏని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏను మరోమారు గెలిపించాలి. బీహార్లో మూడు కారణాల వల్ల ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉంంటూ వాటిని మంత్రి లోకేష్ వివరించారు.
1. లీడర్ షిప్ ట్రాక్ రికార్డు` స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన కోసం ఎన్డీఏని గెలిపించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్లో నాని (నరేంద్ర మోదీ, నితీష్ కుమార్) నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.
2. డబుల్ ఇంజన్ సర్కారు ` బీహార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారమేర్పడుతుంది.
3. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం` గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.
బీహార్లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దు. ఎన్డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానే బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.















