- నూతన సాంకేతికత, ఆవిష్కరణలు అందించండి
- నీతి ఆయోగ్ వైఎస్ సుమన్ బేరీకి సీఎం విజ్ఞప్తి
- రాష్ట్రంలో అవకాశాలు, ఆకాంక్షలపై ప్రజంటేషన్
- అభివృద్ధిలో భాగమవుతామన్న సుమన్ బేరీ..
అమరావతి (చైతన్య రథం): వన్ ఫ్యామిలీ… వన్ ఏఐ ప్రొఫెషనల్ -వన్ ఎంట్రప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర `2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ వైస్చైర్మన్ సుమన్ బేరీతో అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయాలనికి వచ్చిన సుమన్ బేరీకి… ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు, అభివృద్ధి ఆకాంక్షలను ముఖ్యమంత్రి వివరించారు. ఆవిష్కరణలు -సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు తోడ్పడటంలో నీతి ఆయోగ్ సహకారాన్ని ఈ సందర్భంగా కోరారు. ఏపీ ప్రతీ ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పేందుకు, తద్వారా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నీతి ఆయోగ్ మద్దతుంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని… వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా ఉంటుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం ఆకాంక్షపై సుమన్ బేరీ స్పందిస్తూ.. కేంద్రానికి `రాష్ట్రానికి ఇది అనుకూల సమయం. అభివృద్ధికి ఎంతో ఆస్కారముంది. ఆ అభివృద్ధిలో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
‘సర్ణాంధ్ర-2047’పైనే ఫోకస్
ఆర్ధిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత… ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర-2047పై ప్రధానంగా దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. మానవాభివృద్ధి -ఉత్తమ పాలన అంశాల్లో గ్లోబల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని… అందులో ముఖ్యంగా రాష్ట్ర విభజనవల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్ధిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజిన్వంటి హైదరాబాద్ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం ఐదేళ్లపాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలికవసతులను కల్పించకపోవడం… వంటివి ఉన్నాయన్నారు.
సవాళ్లు ఎదురైనా సాధిస్తాం
పాలనలో పలు అడ్డంకులు తలెత్తినా రాష్ట్రానికి ఉన్న అనుకూలతలతో అన్ని విధాలా బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఏపీ 3వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండటం, పోర్టులు -రైల్వే -హైవేలతో అతిపెద్ద కనెక్టవిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు- ఆగ్నేయాసియాకు గేట్వే కావడం, పునరుత్పాదకత విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలుగా వివరించారు.
రాష్ట్రంలో 3 గ్రోత్ హబ్లు
దేశంలోని 4 గ్రోత్ హబ్లో ఒకటిగావున్న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)తో పాటు తిరుపతి, అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ డెవలప్మెంట్.. గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామన్నారు. డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్, ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతిఆయోగ్ కీలకపాత్ర పోషించాలనే ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు సమీక్ష చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం -నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. ఏపీ తీసుకున్న కీలక కార్యక్రమాలైన నదుల అనుసంధానం, పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, 2047 విజన్లోని పది ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. 3 సీ పోర్టులు, 3 ఎయిర్ పోర్టులు ఉన్న తిరుపతి- చెన్నయ్- నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందన్నారు.
కారు దగ్గరకు వెళ్లి మరీ వీడ్కోలు
హైదరాబాద్లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఏపీలో అమలు చేయాలనేది తమ విధానమని ముఖ్యమంత్రి చెప్పారు. 2029కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు, అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్ బేరీకి ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా… సమావేశం అనంతరం ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు దగ్గరకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.