- అత్యుత్తమ నీటి నిర్వహణ విధానం అనుసరించండి
- నీటి వనరుల సంపూర్ణ వినియోగంపై దృష్టి పెట్టాలి
- ప్రతి రిజర్వాయర్, చెరువూ నింపాలి.
- ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
- కృష్ణా, గోదావరి వరద ప్రవాహాలపై ఆన్లైన్ సమీక్ష
- నేడు ప్రకాశం బ్యారేజ్కు 7 లక్షల క్యూసెక్కుల వరద
- అంచనాలను సిఎంకు వివరించిన అధికారులు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరగాలని సూచించారు. ఎగువ రాష్ట్రాలనుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ జరపాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాలనుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలన్నారు.
కృష్ణానదికి రేపు 7 లక్షల క్యూసెక్కుల వరద
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి పంపుతున్నామన్నారు. సోమవారం 7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. శ్రీశైలంనుంచి వస్తున్న వరదతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తోందన్నారు. అలాగే అటు గోదావరిలో ధవళేశ్వరంవద్ద ప్రస్తుతం 10.12 లక్షల క్యూసెక్కుల వరద ఉందని.. ఈ వరద ఉధృతి పెరిగి 11.5 లక్షల క్యూసెక్కులకు రావచ్చని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సముద్రంలోకి వేల టీఎంసీ వరద
కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరద కారణంగా వేల టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తోంది. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 94 శాతం నీటి నిల్వలున్నాయని అధికారులు వివరించారు. పైనుంచి ఇంకా వరద వస్తోన్న కారణంగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణా నదినుంచి సముద్రంలోకి ఇప్పటివరకు 1089 టీఎంసీ జలాలు వెళ్లాయని వివరించారు. గోదావరినుంచి 3251 టీఎంసీ వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని అధికారులు వివరించారు. సమర్ధ నీటి నిర్వహణ, కాల్వల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమంవల్ల భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం పెరిగిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.43 మీటర్లు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.25 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా రాయలసీమలో గత ఏడాదికంటే 2.07 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినట్టు అధికారులు వివరించారు. ఇంకా వరదలు, వర్షాలున్న కారణంగా… నీటి సమర్థ వినియోగానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
చెరువులు నింపడంతోపాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలూ అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు వరదల కారణంగా ముంపు ఉండే ప్రాంతాల ప్రజలను రియల్ టైం సమాచారంతో అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆన్లైన్లో జరిగిన సమీక్షకు ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హాజరయ్యారు.